18 రాష్ట్రాల రెవెన్యూ లోటు 285% జంప్, ఆర్బీఐ విండోను ఉపయోగించిన తెలుగు రాష్ట్రాలు
కరోనా మహమ్మారిపై పోరుకు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రాలకు భారీగా ఖర్చులు అవుతున్నాయి. మరోవైపు ఆరు నెలలుగా ఆదాయాలు తగ్గుతున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం భారీగా తగ్గడంతో.. అక్కడి నుండి రాష్ట్రాలకు వచ్చే నిధులు కూడా తగ్గాయి. ఈ పరిస్థితుల్లో 18 రాష్ట్రాల సమష్టి ఆదాయ లోటు 285 శాతం పెరిగింది.
బడ్జెట్లో వేసిన అంచనాతో పోలిస్తే ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఈ మేరకు పెరిగింది. ఏడాది క్రితం ఇదే క్వార్టర్లో 12.9 శాతం పెరిగినట్లు ఇండియా రేటింగ్స్ నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం 18 పెద్ద రాష్ట్రాల ఆర్థికలోటు, మొత్తం వ్యయం, రిసిప్ట్స్ మధ్య అంతరం మొదటి క్వార్టర్లో 40.7 శాతంగా ఉంది. అంతకుముందు ఏడాది ఇది 13.4 శాతంగా మాత్రమే ఉంది.
అక్టోబర్లో 14 రోజులు బ్యాంకులు క్లోజ్ అవుతాయి... పూర్తి లిస్ట్ ఇదే
ఆదాయాల్లో భారీ క్షీణత
ఆదాయంలో క్షీణత, కరోనా కారణంగా భారీ ఖర్చుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక ఒత్తిడిలో ఉన్నాయి. కరోనా, లాక్ డౌన్ వల్ల అన్ని రకాల పన్నులు తీవ్రంగా పడిపోయిన విషయం తెలిసిందే. ఏప్రిల్-జూన్ కాలానికి కేవలం 18 రాష్ట్రాల రెవెన్యూ రిసిప్ట్స్ అందుబాటులో ఉన్నాయి. ఏడాది ప్రాతిపదికన ఆదాయం 18.41 శాతం తగ్గగా, మరోవైపు ఖర్చులు 11.7 శాతం పెరిగాయి. అయితే వివిధ రాష్ట్రాల్లో ఆదాయం, ఖర్చుల్లో రాష్ట్రాన్ని బట్టి హెచ్చుతగ్గులు ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్, చత్తీస్గఢ్, నాగాలాండ్, ఒడిశా మినహా మిగతా రాష్ట్రాల్లో ఆదాయ తగ్గుదల డబుల్ డిజిట్తో ఉంది. ఆంధ్రప్రదేశ్, మెఘాలయ, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో మాత్రమే ఏడాది ప్రాతిపదికన పెరిగింది.
ఈ రాష్ట్రాల్లో తగ్గింపులు..
కొన్ని రాష్ట్రాల్లో 2019-20 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్తో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం అదే కాలంలో ద్రవ్యలోటు పెరిగినప్పటికీ మొదటి క్వార్టర్లో ఆదాయ మిగులును నమోదు చేశాయి. ఒడిశా, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలపై కరోనా ప్రభావం భారీగానే ఉంది. మొత్తంగా 18 రాష్ట్రాలు తమ ఖర్చుల్లో వేతన, పెన్షన్ ఖర్చులను 10.5 శాతం తగ్గించాయి. సబ్సిడీలు 39.9 శాతం తగ్గించాయి. అదే సమయంలో ఈ ప్రభుత్వాలు ప్రజారోగ్యం, పరిపాలనా ఖర్చులను 40.1 శాతం పెంచాయి. తమిళనాడు, కేరళ, నాగాలాండ్ రాష్ట్రాల్లో ఈ తగ్గింపులు ఎక్కువగా కనిపించగా, చత్తీస్గఢ్, హర్యానా, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో తక్కువగా ఉంది.
ఆర్బీఐ స్పెషల్ విండో.. ఏపీ, తెలంగాణ
రాష్ట్రాల ఆదాయ, ఖర్చులు ఒత్తిడిలో ఉన్నట్లు ఇండియా రేటింగ్స్ నివేదిక వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కరోనా కారణంగా రాష్ట్రాల ఖర్చులు పెరుగుతున్నాయి. కేంద్రానికి ఆదాయం లేక నిధులు తగ్గుతున్నాయి. అలాగే అప్పులు పెరుగుతున్నాయి. ఆర్బీఐ లిక్విడిటీ విండోను (స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ/వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్/ఓవర్ డ్రాఫ్ట్) చాలా రాష్ట్రాలు తక్కువగా ఉపయోగించుకున్నాయి. ఈ సంవత్సరానికి ఇప్పటి వరకు ఈ విండోను ఉపయోగించిన రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, పంజాబ్, కేరళ, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్తో పాటు నాగాలాండ్, మణిపూర్, మిజోరాం వంటి చిన్న రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పుడు కరోనాతో పాటు ఇంతకుముందు కూడా ఉపయోగించుకున్నాయి. మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలు క్యూ1లో దీనిని అసలు ఉపయోగించలేదు.