రిటైల్ రంగానికి రూ.5.5 లక్షల కోట్ల నష్టం, కోట్లమంది బిజినెస్ క్లోజ్, లిక్కర్ షాప్స్ తెరవడంపై ఆగ్రహం
కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా దేశీయ రిటైల్ రంగానికి ఇప్పటి వరకు 5.5 లక్షల కోట్ల నష్టం వచ్చిందని అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య (CAIT) మంగళవారం తెలిపింది. రిటైల్ రంగంలో ఏడు కోట్ల మందికి పైగా వ్యాపారులు ఉన్నారు. రిటైల్ వ్యాపార పరిమాణం రోజుకు రూ.15వేల కోట్లు. ఈ వైరస్ కారణంగా రాబోయే రెండు మూడు నెలల్లో 20 శాతం వ్యాపారాలు మూసేసుకోవాల్సిన పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. వీరిని ఆదుకునేందుకు ప్యాకేజీ అవసరమని CAIT కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ అన్నారు.
రూ.95,000 లిక్కర్ కొనుగోలు చేసిన కస్టమర్, 10 గంటల్లో రూ.45 కోట్లు
కోట్లాది మంది వ్యాపారాలు మూసుకునే ముప్పు
'ఇండియన్ వ్యాపారుల రోజువారీ వ్యాపారం విలువ రూ.15,000 కోట్లు. లాక్ డౌన్ కారణంగా పరిశ్రమకు రూ.5.5 లక్షల కోట్ల నష్టం జరిగింది. ఈ కారణంగా 1.5 కోట్ల మంది వ్యాపారులు తమ బిజినెస్ను శాశ్వతంగా మూసుకోవాల్సిన పరిస్థితి. ఈ వ్యాపారుల మీద ఆధారపడిన 75 లక్షల మంది చిరు వ్యాపారుల్లో కూడా చాలామందికి అదే ముప్పు పొంచి ఉంది. దేశవ్యాప్తంగా 2.5 కోట్ల మంది సూక్ష్మ, చిన్నవ్యాపారులు ఉంటారు' అని ప్రవీణ్ తెలిపారు.
6-9 నెలల సమయం
ఈ పరిస్థితిని తట్టుకునే బలం వ్యాపారులకు లేదని, మరోవైపు ఉద్యోగులకు వేతనాలు, దుకాణాలకు అద్దెలు చెల్లిస్తున్నారని, వారు ఇబ్బందుల్లో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేసింది CAIT. లాక్ డౌన్ కారణంగా కస్టమర్లు కూడా ఖర్చులు తగ్గించుకున్నారని, వారి వద్ద ఖర్చు చేయదగ్గ ఆదాయం లేదని, దీంతో వ్యాపారాలు లేదా వ్యాపారులు సాధారణ స్థితికి రావడానికి ఆరు నెలల నుండి తొమ్మిది నెలల సమయం పట్టవచ్చునని తెలిపింది. ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే మందగమనంలో ఉందని, అన్ని రంగాల్లోను డిమాండ్ లేమి కనిపిస్తోందని పేర్కొంది. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు కోలుకుంటుందో తెలియని పరిస్థితి అని తెలిపింది.
జీడీపీలో 40 శాతం వాటా
భారత జీడీపీలో 40 శాతాని కంటే ఎక్కువగా ఉన్న కార్పోరేటేతర రంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వచించాల్సి ఉందని అలా చేయకపోవడం బాధాకరమని CAIT అభిప్రాయపడింది. మొత్తం శ్రామిక శక్తిలో మూడింట ఒక వంతు వ్యాపార రంగంలో ఉందని చెప్పారు. ఈ పరిస్థితుల్లోను బ్యాంకులకు వడ్డీలు చెల్లించాల్సిందేనని, అద్దెలు చెల్లించాల్సిందేనని, వేతనాలు ఇవ్వాల్సిందేనని పేర్కొంది.
మద్యం దుకాణాలు తెరవడంపై అసహనం
లాక్ డౌన్ సమయంలో మద్యం దుకాణాలు తెరవడాన్ని CAIT వ్యతిరేకించింది. రాష్ట్రాలు తీసుకున్న ఈ చర్య వల్ల 40 రోజులుగా కొనసాగుతున్న లాక్ డౌన్ ప్రయోజనాలను నాశనం చేస్తుందని పేర్కొంది. కరోనా కేసులు పెరగడానికి దోహదపడుతుందని తెలిపింది. అదే సమయంలో ఢిల్లీ వంటి ప్రాంతాల్లో వ్యాపారాలు క్లోజ్ చేయాలని చెప్పడం సరికాదని పేర్కొంది.