వరుసగా రెండో నెల 7%కు పైన, 77 నెలల గరిష్టానికి రిటైల్ ద్రవ్యోల్భణం
ఢిల్లీ: ఆహార ధరల పెరుగుదలతో రిటైల్ ద్రవ్యోల్భణం భారీగా పెరిగింది. గురువారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన వినియోగదారు ధరల సూచీ(CPI-కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్) సూచీ ప్రకారం సెప్టెంబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్భణం 7.27 శాతంగా నమోదయింది. అక్టోబర్ నెలలో 7.61 శాతానికి పెరిగింది. వరుసగా పెరుగుదలను నమోదు చేస్తోంది. గత ఏడాది అక్టోబర్ నెలలో ఇది 4.62 శాతంగా ఉంది. ఇక, సెప్టెంబర్ నెలలో 10.68 శాతంగా ఉన్న వినిమయ ఆధార ధరల సూచీ(CPFI-కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్) అక్టోబర్ మాసంలో 11.07 శాతానికి పెరిగింది.
రియల్ ఎస్టేట్కు పన్ను ఊరట: ఇళ్ల ధరలు తగ్గుతాయా? ఇద్దరికీ ప్రయోజనమే..
77 నెలల గరిష్టానికి రిటైల్ ద్రవ్యోల్భణం
అక్టోబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్భణం 7.6 శాతంతో 77 నెలల గరిష్టానికి చేరుకుంది. అంటే ఆరున్నరేళ్ల గరిష్టాన్ని తాకింది. వరుసగా రిటైల్ ద్రవ్యోల్భణం పెరగడంతో పాటు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో.. వరుసగా రెండో నెల 7 శాతానికి పైగా ఉంది. ఆహార వస్తువుల ధరలు పెరగడం అధిక ద్రవ్యోల్భణానికి కారణమైంది. కీలక రేట్లపై నిర్ణయం తీసుకోవడానికి ముందు రిటైల్ ద్రవ్యోల్భణ గణాంకాలను ఆర్బీఐ పరిగణలోకి తీసుకుంటుంది. ద్రవ్యోల్భణాన్ని 2 శాతం నుండి 6 శాతం మధ్య ఉంచాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఇక రూరల్ ద్రవ్యోల్భణం 7.7 శాతం, అర్బన్ ద్రవ్యోల్భణం 7.4 శాతంగా నమోదయింది. మే 2014లో ద్రవ్యోల్భణం 8.3 శాతం నమోదయిన తర్వాత గరిష్టం ఇప్పుడే.
వచ్చే త్రైమాసికాల్లో దిగిరావొచ్చు
సెప్టెంబర్ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్నప్పటికీ డిసెంబర్, మార్చి త్రైమాసికాలలో లక్ష్యానికి దిగి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆర్బీఐ భావిస్తోంది. వ్యవసాయరంగం పరిస్థితి ఆశాజనకంగా ఉండడం, ముడిచమురు ధరలు నిర్దిష్ట శ్రేణిలో కనిపించడం, అన్-లాక్, సరఫరాల వ్యవస్థ మెరుగు పడటం, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటుండటం వంటి వివిధ కారణాలతో అక్టోబర్ నెలలోను ద్రవ్యోల్భణం అధికంగా ఉన్నప్పటికీ త్రైమాసికం ముగిసే సమయానికి లక్ష్యానికి చేరువలో ఉంటుందని భావిస్తోంది.
డిసెంబర్ క్వార్టర్లో 5.4 శాతానికి, మార్చి క్వార్టర్లో 4.5 శాతానికి దిగి వస్తుందని అంచనా వేస్తున్నారు. డిసెంబర్ త్రైమాసికంలో 3.2 శాతం నుండి 5.9 శాతం, మార్చి త్రైమాసికంలో 2.4శాతం నుండి 6.6శాతం మధ్య ఉంటుందని ఆర్బీఐ అంచనా.
సరళతర ద్రవ్య విధానం వైపు..
అక్టోబర్ నెలలో ఆహార ఉత్పత్తుల కారణంగా ద్రవ్యోల్భణం పెరిగింది. ప్రధానంగా చేపలు 18.7 శాతం, కూరగాయల ధరలు 22.51 శాతం పెరిగాయి. పండ్ల ధరలు కూడా పెరిగాయి. ఇది వడ్డీ రేట్లపై ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. రేటు కంటే లిక్విడిటీపై ఆర్బీఐ దృష్టి సారించవచ్చునని చెబుతున్నారు. డిసెంబర్, మార్చి అంచనాల నేపథ్యంలోను ఆర్బీఐ సరళతర ద్రవ్య విధానం వైపు మొగ్గు చూపుతుందన అంటున్నారు.