Retail Inflation: గరిష్ఠాలకు రిటైల్ ద్రవ్యోల్బణం.. ఫలితాలివ్వని RBI చర్యలు.. సామాన్యుల బతుకు భారం
Retail Inflation: ఒకవైపు వడ్డీల వడ్డన మరో పక్క ధరలు ఆకాశానికి పరుగులు సామాన్యులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. తాజాగా దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరుకోవటంతో పరిస్ఖితులు చేజారుతున్నాయా అనే అనుమానాలు వస్తున్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణం 5 నెలల గరిష్ఠమైన 7.41 శాతాన్ని తాకటంతో.. దేశంలో ఉత్పత్తి సైతం చతికిల పడింది. డిమాండ్ లేక పోవటంతో తయారీ రంగం కుచించుకు పోయింది.
రిజర్వు బ్యాంక్..
ఇలాంటి పరిస్థితి రాకూడదని ముందుగానే రంగంలోకి దిగిన భారతీయ రిజర్వు బ్యాంక్ మార్కెట్లలో లిక్విడిటీని తగ్గించటం ద్వారా నిధుల లభ్యతను అరికట్టడం ప్రారంభించింది. అందుకోసం వడ్డీ రేట్లను వరుసగా నాలుగు సార్లు పెంచింది. అయితే ఈ చర్యల వల్ల ద్రవ్యోల్బణం తగ్గటానికి బదులుగా.. పెరగటం ప్రారంభమైంది. ఇలా జరగటం ఆర్థిక వేత్తలను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. ఇది పరిస్థితులను రిజర్వు బ్యాంక్ ఫెయిల్ అయినట్లు సూచిస్తోంది.
అసలు దొంగ ఇదే..
దేశంలో సెప్టెంబర్ నాటి ఆహార ద్రవ్యోల్బణం గణాంకాలను గమనిస్తే అది ఏకంగా 8.6 శాతానికి చేరుకుంది. ఇది నిర్థేశించుకున్న లిమిల్ట్ కంటే చాలా ఎక్కువని చెప్పుకోవాలి. రిటైల్ ద్రవ్యోల్బణం అదుపు తప్పటానికి వెనుక ఈ ఆహార ద్రవ్యోల్బణం కారణంగా నిలిచింది. అంటే ఆహార ఉత్పత్తులు, కూరగాయలు, ధాన్యాలు ఇలా అన్నింటికి ధరలు పెరుగుతున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం రిజర్వు బ్యాంక్ తో చర్చించే అవకాశం ఉంది.
పెరిగిన ధరలు ఇలా..
ప్రస్తుత సమయంలో కూరగాల ధరలు పెరిగి 18.05 శాతానికి చేరుకున్నాయి. ఇదే సమయంలో మాంసాహారాల ధరలు 1.30 శాతం, ప్యాక్డ్ ఫుడ్స్ ధరలు 0.40 శాతం, దుస్తుల ధరలు 0.80 శాతం పెరగటం సామాన్యులను కోలుకోకుండా చేస్తోంది.
డిసెంబర్ లో మరో పోటు..
ఇప్పటి ఉన్నది చాలదన్నట్లు RBI డిసెంబర్ ఎంపీసీ సమావేశంలోనూ వడ్డీ రేట్లను పెంచక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఈ సారి పెంపు ఎంత ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది. ఇది గనుక జరిగితే సామాన్యులు, మధ్య అల్పాదాయ వర్గాలు పెను భారాన్ని మోయాల్సి ఉంటుంది.
తగ్గిన ఉత్పాదకత..
నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) విడుదల చేసిన డేటా ప్రకారం.. పారిశ్రామికోత్పత్తి సూచిక (IIP) వృద్ధి జూలైలో 2.4%తో పోలిస్తే ఆగస్టులో 0.8% తగ్గింది. ఆగస్టులో మైనింగ్ ఉత్పత్తి తగ్గి 3.9%నికి చేరుకోగా, విద్యుత్ ఉత్పత్తి 1.4% పెరిగింది. ఏప్రిల్ 2020 కరోనా లాక్డౌన్ సమయంలో ఆర్థిక కార్యకలాపాల క్షీణత కారణంగా పారిశ్రామిక ఉత్పత్తి 57.3% తగ్గింది. అలాగే ఇంధనం, విద్యుత్ ధరలు గత నెలలో 11.44% పెరిగాయి.