రిటైల్ ద్రవ్యోల్బణం పైపైకే: వ్యవసాయంలో మరింత దారుణంగా: తాజా లెక్కలివీ
న్యూఢిల్లీ: దేశంలో ద్రవ్యోల్బణ పరిస్థితులు మరింత పెరిగాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి ద్రవ్యోల్బణంలో పైపైకి దూసుకెళ్తూనే ఉంది. మార్చిలో నమోదైన రిటైల్ ద్రవ్యోల్బణంతో పోల్చుకుని చూస్తే.. ఏప్రిల్లో ఇది మరింత పైకి ఎగబాకింది. దీనికి సంబంధించిన లెక్కలను కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది. వ్యవసాయం, కార్మిక రంగాల్లో ఈ పెరుగుదల చోటు చేసుకున్నట్లు వెల్లడించింది.
ఏప్రిల్లో వ్యవసాయం, గ్రామీణ కార్మిక రంగాల్లో ద్రవ్యోల్బణం 6.44, 6.67 శాతం మేర పెరిగింది. ఇదివరకు వ్యవసాయంలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.09, గ్రామీణ కార్మిక రంగంలో 6.33 ఉండేది. ఈ పెరుగుదల ఫలితంగా- కన్జ్యూమర్ ఇండెక్స్ నంబర్ను కూడా సవరించాల్సి వచ్చింది. 10 పాయింట్ల మేర పెంచింది కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ. దీనితో వ్యవసాయానికి సంబంధించిన ఇండెక్స్ నంబర్ 1108, గ్రామీణ కార్మిక రంగం-1119 పాయింట్లకు పెరిగింది.
బియ్యం, జొన్నలు, సజ్జలు, రాగి, గోధుమ, కూరగాయలు, పండ్ల ధరలు భారీగా పెరగడం వల్ల రిటైల్ ద్రవ్యోల్బణానికి దారి తీసినట్లు ఆ మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రాలవారీగా చూసుకుంటే- వ్యవసాయ కార్మిక రంగంలో 19 రాష్ట్రాల్లో పెరుగుదల చోటు చేసుకుంది. ఇందులో 1 నుంచి 20 పాయింట్ల వరకు పెరుగుదల నమోదైంది. కేరళ గరిష్ఠంగా 20 పాయింట్లను రికార్డు చేసింది. గ్రామీణ కార్మిక కేటగిరీలో కేరళ, పశ్చిమ బెంగాల్ సంయుక్తంగా 19 పాయింట్లను అందుకున్నాయి.
తమిళనాడులో మాత్రం ఏడు పాయింట్ల మేర తగ్గింది. సూచీల్లో తమిళనాడు 1275 పాయింట్లతో టాప్లో నిలిచింది. 880 పాయింట్లతో హిమాచల్ ప్రదేశ్ అట్టుడుగు స్థానానికి దిగజారింది. కిందటి వారం దేశ రిటైల్ ద్రవ్యోల్బణం భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఎనిమిది సంవత్సరాల గరిష్ఠానికి చేరుకుంది. ఏప్రిల్లో 7.79 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. ఆహార ధాన్యాలు, ఇతర నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరిగిపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది.