3 నెలల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్భణం, ఏప్రిల్ నెలలో 4.29 శాతం
ఏప్రిల్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం మూడు నెలల కనిష్ఠానికి పడిపోయింది. మార్చి నెలలో 5.52 శాతంగా ఉన్న వినియోగ ధరల సూచీ(CPI) ఆధారిత ద్రవ్యోల్బణం గత నెలలో 4.29 శాతానికి పరిమితమైంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఇది ఐదు శాతంగా ఉంది. ఆహార పదార్థాల ధరలు చవక కావడం ఏప్రిల్ నెలలో ద్రవ్యోల్బణం తగ్గేందుకు కారణమైంది.
కేంద్రగణాంకాలు, కార్యక్రమాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల వివరాల ప్రకారం ఆహార పదార్థాల ద్రవ్యోల్బణ రేటు ఏప్రిల్ నెలలో 2.02 శాతానికి తగ్గింది. మార్చి నెలలో ఇది 4.87 శాతంగా నమోదయింది. ఏడాది క్రితంతో పోలిస్తే కూరగాయల ద్రవ్యోల్బణ రేటు మైనస్ 14.18 శాతంగా ఉంది.
ఆర్బీఐ కీలక రేట్లపై నిర్ణయం తీసుకునే ముందు రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటుంది. దేశీయ పారిశ్రామిక ఉత్పత్తి మార్చి నెలలో గణనీయ వృద్ధిని నమోదు చేసింది. తయారీ, గనులు, విద్యుదుత్పత్తి రంగాలు రాణించడం, బేస్ ఎఫెక్ట్ ఇందుకు తోడ్పడ్డాయి.