RBI: అదానీ వ్యవహారంతో ఆర్బీఐ జాగ్రత్త.. టాప్-20 కంపెనీలపై ఫోకస్..!!
RBI: హిండెన్ బెర్గ్ నివేదిక తర్వాత ఈక్విటీ మార్కెట్లలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రెగ్యులేటరీ ఏజెన్సీలు సైతం ఈ ఘటన నుంచి చాలా విషయాలను నేర్చుకున్నాయి. ఇలాంటివి జరగటం వల్ల చిన్నచిన్న ఇన్వెస్టర్లు భారీగా నష్టపోవటాన్ని నివారించేందుకు రంగంలోకి దిగుతున్నాయి.
రిస్క్ గుర్తించేందుకు..
అదానీ-హిండెన్బర్గ్ వివాదం తర్వాత రిస్క్లను ముందుగానే గుర్తించేందుకు బ్యాంకుల నుంచి అత్యధికంగా రుణాలు తీసుకున్న కంపెనీలపై ఫోకస్ పెట్టాలని RBI నిర్ణయించింది. దీంతో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యిధికంగా రుణాలు కలిగిన టాప్-20 వ్యాపార సంస్థలను నిశితంగా గమనిస్తోంది. వాటి లాభదాయకత, పనితీరు, ఆర్థిక లావాదేవీలపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. బ్యాంకుల నుంచి లేదా బయట ఇతర మార్గాల్లో రుణాలు, కంపెనీపై ఒత్తిడికి సంబంధించిన విషయాలను సెంట్రల్ బ్యాంక్ గమనిస్తోంది.
పర్యవేక్షణ..
ప్రస్తుతం ఉన్న సాధారణ పర్యవేక్షణకు అదనంగా ప్రస్తుత పరిశీలనను రిజర్వు బ్యాంక్ ఏర్పాటు చేసింది. దీని వల్ల భారీ రుణాలకు సంబంధించిన సమాచారం రిపోజిటరీకి అందుతుంది. తాజా పర్యవేక్షణ విధానం ద్వారా వ్యాపారాలపై ఏదైనా ఒత్తిడి ఏర్పడుతున్నప్పుడు ముందుగా వాటిని కట్టడి చేసేందుకు ఉపయోగపడుతుందని రిజర్వు బ్యాంక్ భావిస్తోంది. పైగా ఈ చర్యల వల్ల భవిష్యత్తులో బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లకు వాటి వల్ల నష్టం జరగకుండా కాపాడుకునేందుకు వీలుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు.
వ్యాపార నమూనాలు..
కంపెనీలకు చెందిన వ్యాపార నమూనాతో పాటు వాటి పనితీరును వివిధ పారామితులను వినియోగించి లోన్ పోర్ట్ఫోలియోను అధ్యయనం చేయడానికి ఆర్బీఐ పర్యవేక్షణ తోడ్పడుతుందని తెలుస్తోంది. ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడానికి బ్యాంకింగ్ రంగం, వ్యక్తిగత బ్యాంకులపై "నిరంతర నిఘా" ఉంచుతున్నట్లు ఆర్బీఐ గత నెలలో ఒక ప్రకటన ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే.
బ్యాంకింగ్ మోసాలు..
దేశంలో వరుస బ్యాంక్ మోసాలు నమోదు కావటం, IL&FS డిఫాల్ట్ల తర్వాత బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలపై నిఘాను రిజర్వు బ్యాంక్ పెంచింది. ఇలాంటి వాటి పర్యవేక్షణ, నియంత్రణ కోసం సెంట్రల్ బ్యాంక్ 2019లో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఆయా విభాగాలు ఇలాంటి మోసాలు పెరగకుండా చూసేందుకు వ్యవస్థలను అప్రమత్తం చేసేందుకు కృషి చేస్తుంటాయి.