ఆధార్-పీఎఫ్ లింకింగ్ ఊరట, గడువు డిసెంబర్ 31 వరకు పొడిగింపు
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? ఆధార్ కార్డుతో లింక్ చేయలేదా? అయితే మీకో ఊరట. పీఎఫ్ అకౌంట్-ఆధార్ కార్డును లింక్ చేయని వారికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ EPFO తాజాగా ఆధార్ UAN నెంబర్ లింకింగ్ గడువును పొడిగించింది. ఈ గడువును డిసెంబర్ 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు EPFO తెలిపింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఆధార్-పీఎప్ అకౌంట్ లింక్ గడువు గత డెడ్ లైన్ మేరకు సెప్టెంబర్ 1వ తేదీన ముగిసింది.
అయితే వారికి ఊరట కల్పిస్తూ ఈ గడువును మరోసారి పొడిగించింది. ఇప్పటికైనా ఆధార్-పీఎఫ్ అకౌంట్ను లింక్ చేసుకోని వారు దానిని పూర్తి చేసుకోవడం మంచిది. గడువు పెంచారని ఆలస్యం చేయకూడదు. లేదంటే కంపెనీ చెల్లించే పీఎఫ్ కాంట్రిబ్యూషన్ మీ పీఎఫ్ ఖాతాలో జమ కాదు. దానిని నష్టపోవాల్సి ఉంటుంది.
ఇప్పటి వరకు ఈ గడువు
సెప్టెంబర్ 1వ తేదీ నుండి ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్(EPF) నిబంధనలు మారాయి. ఉద్యోగులు తమ ఈపీఎఫ్ ఖాతాను ఆధార్ కార్డుతో లింగ్ చేయకుంటే కంపెనీ లేదా యజమాని వాటా జమకాదు. దీనికి సంబంధించి కొన్ని నెలల క్రితమే ఈపీఎఫ్ఓ ఉత్తర్వులు జారీ చేసింది. UAN-ఆధార్తో అనుసంధానం చేయకుంటే ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్స్ భర్తీ కాదు. అంటే ఉద్యోగులు వారి సొంత పీఎఫ్ ఖాతాను చూడగలిగినప్పటికీ, కంపెనీ వాటాను మాత్రం పొందలేరు.
ప్రావిడెంట్ ఫండ్ రెగ్యులేటర్ కూడా అన్ని ఈపీఎఫ్ ఖాతాదారుల యూనివర్సల్ అకౌంట్ నెంబర్-ఆధార్ అనుసంధానించాలని యాజమాన్య సంస్థలను ఆదేశించింది. ఇంతకుముందు ఈపీఎఫ్-ఆధార్ లింక్ కోసం 30 మే 2021 వరకు గడువు ఉంది. అయితే వివిధ కారణాలతో ఈపీఎఫ్ఓ.. ఆధార్ లింకింగ్ గడువును ఆగస్ట్ 31 వరకు పొడిగించింది. ఈపీఎఫ్ఓలో ఉద్యోగికి కరోనా అడ్వాన్స్ తీసుకోవడం, పీఎఫ్ ఇన్సురెన్స్, ఇతర సేవింగ్స్ స్కీమ్స్ కంటే అధిక వడ్డీ రేటు వంటి పలు ప్రయోజనాలు ఉన్నాయి.
ఈపీఎఫ్-ఆధార్ లింకింగ్
- పీఎఫ్ పోర్టల్లోకి లాగ్-ఇన్ కావాలి.
- మీ UAN, ఆధార్లో నమోదు చేసుకున్న మొబైల్ నెంబర్ను నమోదు చేయాలి.
- జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి.
- ఓటీపీని పూర్తి చేసి జెండర్ను ఎంచుకోవాలి.
- ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసి ఆధార్ వెరిఫికేషన్ను ఎంచుకోవాలి.
- మొబైల్, ఈ-మెయిల్ ఆధారిత ధృవీకరణ ఎంపికను ఎంచుకోవాలి.
- మీ మొబైల్ నెంబర్కు మరో ఓటీపీ వస్తుంది.
- రెండో ఓటీపీని నమోదు చేయాలి.
- ఈ ఈపీఎఫ్, UAN ఆధార్ లింకింగ్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు.
అనుసంధానంలో ఇబ్బంది లేదు
ఆధార్ కార్డుతో పాన్/EPFO అనుసంధాన సదుపాయాల్లో ఎలాంటి అంతరాయం లేదని ఇటీవల యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) ఇటీవల పేర్కొంది. అన్ని సేవలు స్థిరంగా ఉన్నట్లు, సక్రమంగా పని చేస్తున్నట్లు వెల్లడించింది. కొద్ది రోజుల క్రితం ఆధార్తో పాన్, ఈపీఎఫ్ఓల అనుసంధానంలో అంతరాయం కలుగుతోందన్న వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో UIDAI పది రోజుల క్రితం పైవిధంగా స్పందించింది. గతవారం రోజులుగా తమ వ్యవస్థల్లో అవసరమైన భద్రతాపరమైన మెరుగులు జరుగుతున్నాయని, ఆ సమయంలో కొంత మేర సేవల్లో అంతరాయం కలిగిందని తెలిపింది. అది కూడా కొన్ని కేంద్రాల్లో మాత్రమే ఎన్రోల్మెంట్, మొబైల్ అప్ డేషన్ సర్వీసుల్లో ఇబ్బంది తలెత్తిందని, ఇప్పుడు అన్నీ పని చేస్తున్నాయని UIDAI తెలిపింది.