ఆటో, టెలికం రంగానికి భారీ ప్యాకేజీ: ఆటో రంగంలో కేవలం వాటికే
కరోనా నేపథ్యంలో వివిధ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న దేశీయ వాహన రంగానికి ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఎలక్ట్రిక్, హైడ్రోజన్ ఆధారిత వాహనాల గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో వాటి ఉత్పత్తిని పెంచేందుకు గాను ఈ రంగానికి రూ.26,058 కోట్లతో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలను(PLI) ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం దీనికి ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా ఆటో రంగంలో దాదాపు 7.5 లక్షల ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం అంచనా. ఆటో, ఆటో విడిభాగాలు, డ్రోన్ పరిశ్రమకు ఈ ప్రోత్సాహక పథకం ప్రకటించింది. ఇందులో రూ.25,938 కోట్లు ఆటో రంగానికి, రూ.120 కోట్లు డ్రోన్ పరిశ్రమకు కేటాయించారు. టెలికం రంగానికి కూడా కేంద్రం భారీ ప్యాకేజీని ఇచ్చింది. టెలికం కంపెనీలకు ఏజీఆర్ బకాయిలు చెల్లించడానికి మారటోరియం ఇచ్చింది. కేంద్రం ప్యాకేజీ, ఊరట నేపథ్యంలో ఆటో, టెలికం రంగాల షేర్లు నిన్న భారీగా పెరిగాయి.
ఆటో ప్యాకేజీ కానీ వాటికే...
ఆటో రంగానికి ఇచ్చిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం కేవలం స్వచ్ఛ ఇంధన ఆధారిత వాహన తయారీ సంస్థలకు మాత్రమే. పెట్రోల్, డీజిల్ ఆధారిత వాహన తయారీ సంస్థలకు ఇది వర్తించదని తెలుస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరం నుండి అయిదేళ్ల వ్యవధితో ఈ పథకాన్ని ప్రకటించింది. 10 వాహన తయారీ సంస్థలు, 50 ఆటో విడిభాగాల ఉత్పత్తి సంస్థలు దీని నుండి లబ్ధి పొందుతాయి. మొత్తం 22 విడిభాగాల తయారీకి ఈ ప్రోత్సాహకాలు అందిస్తోంది.
వాతావరణ మార్పులు, ప్యారీస్ ఒప్పందం నేపథ్యంలో భారత్ స్వచ్ఛ ఇంధనం దిశగా అడుగులు వేస్తోంది. మరోవైపు చమురు అవసరాలు పెరగడంతో దిగుమతుల కోసం విదేశాలపై ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో దేశీయంగా ధరలు పెంచవలసిన వస్తోంది. ఇది నిత్యావసర ధరలపై ప్రభావం చూపుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా విద్యుత్, హైడ్రోజన్ ఆధారిత వాహనాలను ప్రోత్సహించేందుకు సిద్ధమైంది. అయితే ఇప్పటి వరకు దేశీయంగా ఇంకా అనేక వాహన సంస్థలు విద్యుత్ వాహనాల తయారీ వైపు మళ్లవలసి ఉంది. టాటా మోటార్స్ మాత్రమే విద్యుత్ వాహనాలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తోంది. మహీంద్రా అండ్ మహీంద్రా, టీవీఎస్ మోటార్, హీరో మోటో కార్ప్ ఇప్పుడిప్పుడే ఈవీ రంగంలోకి వస్తున్నాయి.
షేర్లు జూమ్
కేంద్రం ప్యాకేజీ ప్రకటన నేపథ్యంలో టెలికాం, ఆటో కంపెనీల షేర్లు నిన్న జంప్ చేశాయి. సూచీలు సరికొత్త శిఖరాలను తాకాయి. సెన్సెక్స్ 476 పాయింట్ల లాభంతో 58,723 వద్ద, నిఫ్టీ 139 పాయింట్ల లాభంతో 17,519 వద్ద ముగిసింది. దీంతో బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల షేర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ వ్యాల్యూ నిన్న ఒక్కరోజే రూ.3.35 లక్షల కోట్ల పెరిగింది. దీంతో మార్కెట్ క్యాప్ రూ.259.68 లక్షల కోట్లకు చేరుకుంది.
ప్యాకేజీపై హర్షం
కేంద్రం ప్రకటించిన ఆటో ప్యాకేజీ బాగుందని ఈ రంగం నిపుణులు అంటున్నారు. కొత్త PLI స్కీంతో ఆటో రంగంలో భవిష్యత్తు టెక్నాలజీ వినియోగానికి ప్రేరణ లభిస్తుందని, కరోనా సంక్షోభం ప్రతి అంశంలో స్వయం సమృద్ధి అవశ్యకతను నేర్పిందని చెబుతున్నారు. ఆటో రంగంలో వివిధ విభాగాలకు ఊతమిచ్చేలా కేంద్రం పీఎల్ఐ పథకాన్ని సవరించిందని, ఎగుమతులకు దోహదపడుతుందని చెబుతున్నారు.
ఇక టెలికం రంగం కోసం ప్రభుత్వం ప్రకటించిన సంస్కరణలు, ఊరట చర్యలపై ఇండస్ట్రీ హర్షం వ్యక్తం చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్టెల్ ప్యాకేజీని స్వాగతించాయి. కస్టమర్లకు సరికొత్త, మరిన్ని ప్రయోజనాలు అందించేందుకు ఈ సంస్కరణలు ప్రోత్సాహంగా ఉంటాయని జియో పేర్కొంది. డిజిటల్ ఇండియా లక్ష్యాలు, మైలురాళ్లను చేరుకునే విషయంలో ప్రభుత్వం, ఇతర టెలికం సంస్థలతో కలిసి పని చేస్తామని కూడా పేర్కొంది. టెలికం రంగంలో ఆరోగ్యకర వృద్ధికి ప్యాకేజీ తోడ్పడుతుందని వొడాఫోన్ ఐడియా తెలిపింది. ఆర్థిక ఒత్తిడిలో ఉన్న టెలికం రంగానికి ఇది ఊరట అని చెబుతున్నారు.