శ్రీలంక కంపెనీని టేకోవర్ చేసిన ముఖేష్ అంబానీ: కూతురి కోసం దేన్నీ వదలట్లేదుగా
ముంబై: దేశీయ పారిశ్రామిక దిగ్గజం, అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ.. తన వ్యాపార పరిధిని విస్తరించుకుంటూనే ఉన్నారు. ప్రతి నెలా ఏదో ఒక కంపెనీని టేకోవర్ చేస్తోన్నారు. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులతో పాటు రిటైల్ బిజినెస్ను కూడా పెంచుకుంటోన్నారు. కొద్దిరోజుల కిందటే భారత్లో టాప్ కాస్ట్యూమ్స్ డిజైనర్ మనీష్ మల్హోత్రా, రితూకుమర్కు చెందిన కంపెనీల్లో మెజారిటీ వాటాలను కొనుగోలు చేశారు.
ఇప్పుడు తాజాగా శ్రీలంకకు చెందిన టాప్ బ్రాండింగ్ సంస్థను కొనుగోలు చేశారు. వందశాతం టేకోవర్ చేసుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గ్రూప్ కంపెనీల్లో ఒకటైన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ కిందికి దాన్ని తీసుకొచ్చారు. అమాంటే బ్రాండ్ నేమ్తో అప్పారెల్స్ సెగ్మెంట్లో శ్రీలంకలో టాప్ కంపెనీల్లో ఒకటైన ఎంఎఎస్ హోల్డింగ్స్ను రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ తాజాగా టేకోవర్ చేసింది. ఇందులో వందశాతం మేర పెట్టుబడులను పెట్టింది.
ముఖేష్ అంబానీ కుమార్తె ఈషా అంబానీ.. ఈ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తోన్నారు. అమాంటేను టేకోవర్ చేసుకోవడం ద్వారా శ్రీలంక రిటైల్ మార్కెట్లో కూడా రిలయన్స్ అడుగు పెట్టినట్టయింది. వంద శాతం మేర స్టేక్స్ను కొనుగోలు చేయడం ద్వారా పూర్తి స్థాయిలో ఆ కంపెనీ రిలయన్స్ ఆధీనంలోకి వచ్చినట్టయింది. ఎంత మొత్తాన్ని ఖర్చు చేసి, ఈ కంపెనీని రిలయన్స్ రిటైల్స్ టేకోవర్ చేసిందనేది తెలియరాలేదు. ఆ అమౌంట్ను రిలయన్స్ యాజమాన్యం గానీ, అమాంటే గానీ వెల్లడించడానికి ఇష్టపడట్లేదు.
ఎంఎఎస్ హోల్డింగ్స్ కంపెనీ 2007లో ఏర్పాటైంది. శ్రీలంక వ్యాప్తంగా ఈ కంపెనీకి రిటైల్ షోరూమ్స్, మల్టీ బ్రాండ్ అవుట్లెట్స్ ఉన్నాయి. అమాంటే, అల్టిమో అనే బ్రాండ్ నేమ్స్తో ఈ కంపెనీ తన ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తుంటుంది. అమాంటే ప్రొడక్ట్స్కు భారత్లోనూ మంచి గిరాకీ ఉంటోంది. ఇ-కామర్స్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఎంఎఎస్ ఉత్పత్తులు దేశ ప్రజలకు చిరపరిచితం అయ్యాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆ కంపెనీని టేకోవర్ చేయాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్ణయించింది. దీన్ని కార్యాచరణలోకి తీసుకొచ్చింది.
కొద్దిరోజుల కిందటే బాలీవుడ్ కాస్ట్యూమ్స్ డిజైనర్ మనీష్ మల్హోత్రాకు చెందిన ఎంఎం స్టైల్స్లో మెజారిటీ స్టేక్స్ను రిలయన్స్ రిటైల్ వెంచర్స్ కొనుగోలు చేసింది. 40 శాతం వాటాలు రిలయన్స్ రిటైల్స్కు ఉన్నాయి. అదే తరహాలో రితూ కుమార్కు చెందిన రితిక ప్రైవేట్ లిమిటెడ్ను కూడా తన ఖాతాలో వేసుకుంది. ఇందులో 52 శాతం వాటాలను కొనుగోలు చేసింది. ఇప్పడిక అమాంటేను వందశాతం టేకోవర్ చేసుకోవడం ద్వారా రిలయన్స్ రిటైల్ వెంచర్స్ శ్రీలంకలో ఎంట్రీ ఇచ్చినట్టయింది.