వావ్.. రిలయన్స్: ప్రపంచంలో 2వ స్థానంలో..! ఇన్వెస్టర్లకు కొద్దిరోజుల్లో అదిరిపోయే రిటర్న్స్
ఇటీవలి కాలంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ దూసుకెళ్తోంది. కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ ఏకంగా వరల్డ్ టాప్ 5 కుబేరుడిగా నిలిచారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ప్రపంచంలో టాప్ 50 కంపెనీల్లో చోటు దక్కించుకుంది. రిలయన్స్ మరో ఘనత కూడా సాధించింది. ప్రపంచంలోని రెండో అత్యధిక వ్యాల్యూ కలిగిన ఎనర్జీ సంస్థగా నిలిచింది. శుక్రవారం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.14 లక్షల కోట్లను దాటింది. దీంతో ఎక్సాన్ మొబిల్ను రిలయన్స్ వెనక్కి నెట్టింది. సౌదీ ఆరామ్కో అగ్రస్థానంలో ఉంది.
టాప్ 4 ఐటీ కంపెనీల్లో తగ్గిన హెడ్ కౌంట్.. ఎందుకు, భవిష్యత్తేమిటి?
షేర్ ధర జూమ్... 46వ స్థానానికి
స్టాక్ మార్కెట్ డేటా ప్రకారం ఆయుల్ టు టెలికం దిగ్గజం మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా తొలుత వరల్డ్ టాప్ 50లో 48వ స్థానానికి, ఆ తర్వాత 46వ స్థానానికి ఎగబాకింది. గురువారం 48వ స్థానంతో ఎక్సాన్ మొబిల్ వెనుక ఉంది. శుక్రవారం రిలయన్స్ షేర్ ధర జీవనకాల గరిష్టానికి రూ.2,163కు చేరుకుంది. ఆ తర్వాత రూ.2,148 వద్ద ముగిసింది. కంపెనీ ఎం-క్యాప్ భారీగా పెరిగి ప్రపంచంలో 46వ స్థానంలోకి వచ్చింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎం-క్యాప్ రూ.13.6 లక్షల కోట్లు, అలాగే ఇటీవల రైట్స్ ఇష్యూ ద్వారా రూ.54,262 కోట్లు వచ్చాయి.
దిగ్గజ కంపెనీల ఎంక్యాప్
ఈ మొత్తం కలిపి కంపెనీ మార్కెట్ వ్యాల్యూ రూ.14.1 లక్షల కోట్లుగా లేదా 189.3 బిలియన్ డాలర్లుగా ఉంది. ఎక్సాన్ మొబిల్ మార్కెట్ క్యాప్ $ 184.7 బిలియన్లుగా ఉంది. ఎనర్జీ సంస్థల్లో సౌదీ ఆరామ్కో ప్రపంచంలోనే టాప్ కంపెనీగా ఉంది. దీని ఎం-క్యాప్ 1.75 ట్రిలియన్లుగా ఉంది. అన్ని కంపెనీలు లెక్కలోకి తీసుకుంటే 1.6 ట్రిలియన్ డాలర్లతో ఆపిల్ రెండో స్థానంలో, 1.5 ట్రిలియన్ డాలర్లతో మైక్రోసాఫ్ట్ మూడో స్థానంలో, 1.48 ట్రిలియన్ డాలర్లతో అమెజాన్ నాలుగో స్థానంలో, 1.03 ట్రిలియన్ డాలర్లతో అల్పాబెట్ ఐదో స్థానంలో ఉంది.
పెప్సికోకు సమీపంలో రిలయన్స్
ఇంధన కంపెనీల ప్రకారం చూసుకుంటే సౌదీ ఆరామ్ కో తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండో స్థానంలో నిలిచింది. ఓ భారతీయ కంపెనీ రూ.14 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ను దాటడం రిలయన్స్ కావడం గమనార్హం. ఎక్సాన్ మొబిల్తో పాటు ఒరాకిల్, యూనీలీవర్, బ్యాంక్ ఆఫ్ చైనా, బీహెచ్పీ గ్రూప్, రాయల్ డచ్ షెల్, సాఫ్ట్ బ్యాంకు గ్రూప్స్ ఎం క్యాప్ కంటే రిలయన్స్ మార్కెట్ క్యాప్ ఎక్కువ. ఆసియాలో రిలయన్స్ 10వ స్థానంలో ఉంది. చైనాకు చెందిన అలీబాబా ప్రపంచంలోనే 7వ ర్యాంకులో ఉంది. పెప్సికో ఎం-క్యాప్ 189.8 బిలియన్ డాలర్లుగా ఉంది. రిలయన్స్ కంటే కాస్త ముందంజలో ఉంది.
4 నెలల్లోనే..
రిలయన్స్ షేర్ మార్చి 23వ తేదీన రూ.867 కనిష్టానికి చేరుకుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో మార్కెట్లు కుప్పకూలినప్పుడు రిలయన్స్ షేర్ కూడా భారీగా పడిపోయింది. కంపెనీ మార్కెట్ క్యాప్ కూడా రూ.5.5 లక్షల కోట్లకు (73.5 బిలియన్ డాలర్లు) పడిపోయింది. అయితే నాలుగు నెలల్లోనే షేర్ హోల్డర్స్ సంపద 115.9 బిలియన్ డాలర్లు పెరిగింది. అంటే దాదాపు రూ.8.5 లక్షల కోట్ల నుండి రూ.9 లక్షల కోట్ల సంపద పెరిగింది. ఇంత తక్కువ సమయంలో ఆ స్థాయికి చేరుకోవడం గమనార్హం. జియో ప్లాట్ఫాంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం, రైట్స్ ఇష్యూ ద్వారా సమీకరణ.. తద్వారా షేర్ ధర రూ.2,146కు చేరుకోవడం కలిసి వచ్చింది.
మంచి రిటర్న్స్
గత ఐదు వారాల్లో 39 బిలియన్ డాలర్లు పెరిగింది. గత 14 ట్రేడింగ్ సెషన్లలో 29 బిలియన్ డాలర్లు పెరిగింది. ఇటీవల జారీ చేసిన రిలయన్స్ పీపీ లేదా పార్టీ పెయిడప్ షేర్లు రెండు నెలల కాలంలో 4.1 రెట్ల రిటర్న్స్ ఇచ్చాయి. రిలయన్స్ రైట్స్ ఇష్యూ జూన్ 4న క్లోజ్ అయింది.