'జియోమార్ట్' సర్వీస్ను లాంచ్ చేసిన రిలయన్స్.. మెట్రో నగరాల్లో అందుబాటులోకి..
రిలయన్స్ ఇండస్ట్రీస్ తమ జియో మార్ట్ సర్వీసులను శనివారం(మే 23) నుంచి దేశంలోని అన్ని ప్రధాన మెట్రో నగరాలకు విస్తరించింది. నేవీ ముంబైలో పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైన తర్వాత విస్తరణను చేపట్టింది. గతంలో ఉన్న reliancesmart.in ఇప్పుడు jiomart.comకి రీడైరెక్ట్ కానుంది.
కస్టమర్స్ జియో మార్ట్ వెబ్సైట్కి లాగిన్ అయి కావాల్సిన ఆర్డర్స్ చేసుకోవచ్చు. పండ్లు,కూరగయాలు,డైరీ ప్రొడక్ట్స్,బేకరీ,పర్సనల్ కేర్,హోమ్ కేర్,బేబీ కేర్ తదితర వస్తువులు ఇందులో లభ్యమవుతాయి. రూ.750 కనీస ఆర్డర్పై ఉచిత డెలివరీ సదుపాయాన్ని జియోమార్ట్ అందిస్తోంది. ఒకవేళ అంతకంటే తక్కువ ఆర్డర్ చేస్తే... రూ.25 డెలివరీ చార్జీలు వసూలు చేస్తారు.
గత ఆర్నెళ్లుగా నేవీ ముంబై,థానే,కల్యాణ్లలో జియోమార్ట్ సేవలను పైలట్ ప్రాజెక్ట్గా చేపట్టారు. ఇందుకోసం అత్యంత సులువైన ప్రక్రియను రూపొందించారు. కస్టమర్స్ జియోమార్ట్కి సంబంధించిన ఒక నంబర్ను వాట్సాప్కి యాడ్ చేసుకోవడం ద్వారా సులువుగా ఆర్డర్స్ చేసే సదుపాయం కల్పించారు.
కాగా,రిలయన్స్ రిటైల్ 11,784 ఔట్లెట్స్తో దేశంలోనే అతిపెద్ద ఆఫ్లైన్ రిటైలర్గా ఉంది. జియోమార్ట్ ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ ట్రేడ్లను అనుసంధానం చేసేందుకు రిలయన్స్ ప్లాన్ చేస్తోంది. కేవలం రిలయన్స్ స్టోర్స్ ద్వారా మాత్రమే కాకుండా హైపర్ లోకల్ 'రిలయన్స్ స్మార్ట్ పాయింట్స్'ను విస్తరించాలని చూస్తోంది. చిన్న చిన్న కిరాణ షాపులను సైతం తమ నెట్వర్క్లో రిజిస్టర్ చేయించేలా రిలయన్స్ ప్లాన్ చేస్తోంది. తద్వారా కస్టమర్స్ తమకు సమీపంలోనే కావాల్సిన వస్తువులను పొందగలరు.
తాజాగా రిలయన్స్ జియోలో అమెరికా ఈక్విటీ దిగ్గజం కేకేఆర్ రూ.11,367కోట్లు పెట్టుబడి పెట్టింది. ఈ మేరకు జియో ప్లాట్ఫామ్స్లో 2.32శాతం వాటాను కేకేఆర్కు రిలయన్స్ బదలాయించనుంది. ఇప్పటికే ఫేస్బుక్,సిల్వర్ లేక్,విస్టా ఈక్విటీ పార్ట్నర్స్,జనరల్ అట్లాంటిక్ జియోలో పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. ఫేస్బుక్ 5.7బిలియన్ డాలర్లను జియోలో పెట్టుబడిగా పెట్టింది.