Rcom: తమ్ముడిని కాపాడే పనిలో అన్న.. రంగంలోకి రిలయన్స్ జియో.. వేల కోట్లు డిపాజిట్..
Anil Ambani: అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ దివాలా తీసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ కంపెనీ ఆస్తులను సొంతం చేసుకునే ప్రయత్నంలో ఉంది. అయితే ఈ సెటిల్మెంట్ ఎట్టకేలకు 2 ఏళ్ల తర్వాత ముగుస్తోంది.
డబ్బు డిపాజిట్..
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ముంబైలోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో తాజాగా దరఖాస్తును దాఖలు చేసింది. ఈ దరఖాస్తులో రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ కంపెనీని, దాని ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్క్రో ఖాతాలో రూ.3,720 కోట్లను డిపాజిట్ చేసేందుకు సిద్ధమని వెల్లడించింది. దీని ద్వారా దివాలా తీసిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ టెలికాం టవర్ అండ్ ఫైబర్ ఆస్తులను జియో చేజిక్కించుకోనుంది.
అనిల్ అంబానీ..
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ టెలికాం మార్కెట్లో తీవ్ర పోటీ కారణంగా కస్టమర్లను కోల్పోయింది. దీంతో బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాలను డీఫాల్ట్ అయి కంపెనీ దివాళీ తీసింది. అయితే కంపెనీకి రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ కింద ఉన్న ఆస్తులను కొనుగోలు చేసేందుకు రిలయన్స్ జియో ఎంపికైంది. అయితే ఆస్తులను సొంతం చేసుకోవటంలో జాప్యం జరుగుతోంది. అయితే రిజల్యూషన్ నిధుల పంపిణీపై రుణదాతల మధ్య వివాదాలు కొనసాగుతున్నందున వాటి విలువ తగ్గుతోందని అక్టోబర్ 20న NCLTకి సమర్పించిన నివేదికలో జియో తెలిపింది.
కుప్పకూలిన సామ్రాజ్యం..
ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీల మధ్య కొన్నేళ్లుగా అనేక సమస్యలు ఉన్నప్పటికీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ దివాళా తీయడంతో అనిల్ అంబానీ సామ్రాజ్యం కుప్పకూలింది. దీంతో ఆర్ కామ్ ఆస్తులను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఆసక్తి చూపింది.
అనిల్ కృతజ్ఞతలు..
ఈ ప్రకటనతో అంబానీ సోదరులు సన్నిహితంగా మారడమే కాకుండా, తనకు సహాయం చేసినందుకు అనిల్ అంబానీ కృతజ్ఞతలు తెలిపారు. దీని తర్వాత లండన్ కోర్టులో అనిల్ అంబానీపై దాఖలైన కేసులో తనకు ఎలాంటి ఆస్తులు లేవని, తన ఆస్తి విలువ సున్నా అని గతంలోనే ప్రకటించారు.