అదరగొట్టిన జియో, వొడాఫోన్ ఐడియా మొదటిసారి జంప్
2021 ఫిబ్రవరిలో రిలయన్స్ జియో అదరగొట్టింది. అత్యధిక కొత్త స్మార్ట్ ఫోన్ యూజర్లను చేర్చుకోవడం ద్వారా ప్రత్యర్థి ఎయిర్టెల్ను అధిగమించింది. గత ఏడాది జూలై (2020) నుండి మొదటిసారి ఓ నెలలో ఎయిర్ టెల్ కంటే జియో సబ్స్క్రైబర్లు ఎక్కువగా ఉన్నారు. ఫిబ్రవరి నెలనాటికి జియో సబ్స్క్రైబర్లు 415 మిలియన్లుగా ఉన్నారు. ఫిబ్రవరి నెలలో 42 లక్షల మంది కొత్త యూజర్లు జియోకు జత కలిశారు.
దాదాపు సంవత్సరంన్నర తర్వాత వొడాఫోన్ ఐడియాకు సబ్స్క్రైబర్లు జత కలిశారు. అక్టోబర్ 2019 నుండి ప్రతి నెల కూడా వొడాఫోన్ ఐడియా నుండి సబ్స్క్రైబర్లు దూరం జరిగారు. కానీ మొదటిసారి ఫిబ్రవరి నెలలో జత కలిశారు. టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI) ప్రకారం ఈ నెలలో జియో, భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా... మూడు కూడా సబ్స్క్రైబర్లను జత చేసుకున్నాయి.
రెగ్యులేటరీ ప్రకారం ఎయిర్టెల్ 3.7 మిలియన్ల కొత్త యూజర్లు జత కలిశారు. వొడాఫోన్ ఐడియాకు కూడా ఓ నెలలో పెద్ద ఎత్తున జత కలవడం గమనార్హం. దీంతో వొడాఫోన్ ఐడియా యూజర్ బేస్ 282.6 మిలియన్లకు చేరుకుంది. ఫిబ్రవరి నెలలో జియోకు 4.2 మిలియన్ల మంది జత కలిశారు. జనవరి నెలలో ఇది 1.9 మిలియన్లుగా ఉంది. ఎయిర్ టెల్కు జనవరిలో 5.8 మిలియన్ల మంది జత కలిశారు. ట్రాయ్ ప్రకారం ఫిబ్రవరి నాటికి మొత్తం వైర్ లెస్ సబ్స్క్రైబర్లు 1,167.71 మిలియన్లకు చేరుకున్నారు.