జియో నుంచి శాటిలైట్ ఆధారిత బ్రాడ్బ్యాండ్ సేవలు: టాప్ ఫారిన్ కంపెనీతో టైఅప్
ముంబై: దేశీయ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్- మరో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. రిలయన్స్ జియో సేవలను మరింత విస్తరించుకోవడంలో భాగంగా ఓ విదేశీ కంపెనీతో టైఅప్ కానుంది. ఈ రెండు కంపెనీలు కలిసి జాయింట్ వెంచర్గా ఏర్పడనున్నాయి. ప్రత్యేకంగా ఓ కార్పొరేట్ కంపెనీని నెలకొల్పనున్నాయి. 51, 49 శాతం వాటాలతో ఈ జాయింట్ వెంచర్ కంపెనీ ఆవిర్భవించనుంది.
లగ్జెంబర్గ్కు చెందిన శాటిలైట్ ఆధారిత బ్రాడ్బ్యాండ్ కంపెనీ ఎస్ఈఎస్తో ఒప్పందాన్ని కుదుర్చుకోబోతున్నామని రిలయన్స్ జియో వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. దేశంలో బ్రాడ్బ్యాండ్ సేవలను మరింత విస్తరించుకోవడంలో భాగంగా ఎస్ఈఎస్ కంపెనీతో ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు తెలిపింది. ఉపగ్రహ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానంతో బ్రాడ్బ్యాండ్ సేవలను అందించే దిశగా ముందడుగు వేశామని పేర్కొంది.
జియోస్టేషనరీ, మీడియం ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ కన్స్టెల్లేషన్స్, జియో స్పేస్ టెక్నాలజీ ఆధారంగా ఈ బ్రాడ్బ్యాండ్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని రిలయన్స్ పేర్కొంది. మల్టీ-గిగాబైట్ లింక్స్, మొబైల్ బ్యాక్ హాల్, రిటైల్ కస్టమర్ల వరకూ ఈ సేవలను తీసుకెళ్తామని తెలిపింది. జాయింట్ వెంచర్గా ఏర్పాటు చేయబోయే కంపెనీలో 51:49 శాతం ప్రాతిపదికన ఎస్ఈఎస్, జియోల వాటాలు ఉంటాయని వివరించింది.
జియో స్పేస్ టెక్నాలజీని ఎస్ఈఎస్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుందని, దీనికి అవసరమైన ప్లాట్ఫామ్స్ను తాము సమకూరుస్తామని పేర్కొంది. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఉపగ్రహ ఆధారిత బ్రాడ్ బ్యాండ్ సేవలను అందించడానికి అవసరమైన ఏర్పాట్లను త్వరలోనే చేపడతామని, భారతీయ మార్కెట్లో అడుగు పెట్టబోతోండటం సంతోషాన్ని ఇస్తోందని ఎస్ఈఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్టీవ్ కాలర్ చెప్పారు. హైక్వాలిటీ కనెక్టివిటీతో తమ సేవలను యూజర్లకు అందిస్తామని అన్నారు.