ముంబై: దేశంలోనే టాప్ మొబైల్ యూజర్గా గుర్తింపు తెచ్చుకున్న రిలయన్స్ జియో నెట్వర్క్.. ఒక్కసారిగా స్తంభించిపోయింది. కొన్ని గంటలుగా జియో ఫోన్ వినియోగదారులు కాల్స్ చేయలేకపోయారు.. వాటిని రిసీవ్ చేసుకోలేకపోయారు. కొన్ని గంటల పాటు నెట్వర్క్ స్తంభించిపోవడంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై చెలరేగిపోయారు. రిలయన్స్ జియో నెట్వర్క్ను భారీ ట్రోల్ చేశారు.
ఈ ఉదయం నుంచీ రిలయన్స్ జియో నెట్వర్క్ పనిచేయట్లేదంటూ పలువురు వినియోగదారులు మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్పై పోస్టులు పెట్టారు. కల్యాణ్, దాదర్, నవీ ముంబై, అంధేరి, డోంబీవిలి, బాంద్రా, జోగేశ్వరి, గోరేగావ్, దహీసర్, బైకుల్లా వంటి ప్రాంతాల్లో నెట్వర్క్ స్తంభించింది. జియో సిమ్ నుంచి ఫోన్ కాల్స్ చేయలేకపోయారు.. రిసీవ్ చేసుకోలేకపోయారు. ఇంటర్నెట్ కూడా అవుటేజ్కు గురైంది. ఫలితంగా అయోమయానికి గురయ్యారు.

జియో సిమ్ను వినియోగించే వారి ఫోన్లన్నీ నో రిజిస్టర్డ్ ఆన్ నెట్వర్క్ అంటూ చూపించాయి. మరి కొన్ని స్మార్ట్ఫోన్లల్లో నో సిమ్ కార్డ్స్ అనే మెసేజ్ కనిపించింది. ఉదయం 11:35 నిమిషాల నుంచి నెట్వర్క్ స్తంభించిపోయింది. దీనితో వినియోగదారులు రిలయన్స్ జియో కస్టమర్ కేర్కు ఫోన్లు చేశారు. రెండు గంటల వ్యవధిలో 2,758 ఫోన్ కాల్స్ వారికి అందినట్లు తేలింది. ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా జియో మేనేజ్మెంట్కు ఫిర్యాదులు చేశారు.
వీటన్నింటిపైనా రిలయన్స్ జియో యాజమాన్యం స్పందించింది. అవుటేజ్ను ధృవీకరించింది. తమ నెట్వర్క్ స్తంభించిపోయిందనే విషయం నిజమేనని పేర్కొంది. దీనిపై తమ టెక్నికల్ టీమ్ పని చేస్తోందని తెలిపింది. నెట్వర్క్ను పునరుద్ధరించడానికి శ్రమిస్తోందని వివరించింది. సాధ్యమైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరిస్తామని, నెట్వర్క్ను రీస్టోర్ చేస్తామని స్పష్టం చేసింది. సాంకేతిక లోపాల వల్లే ఈ సమస్య తలెత్తిందని వివరించింది.


Click it and Unblock the Notifications