వొడాఫోన్ ఐడియాకు భారీ షాక్, 3 కోట్లు తగ్గిన యూజర్లు, ఛార్జీ పెంచిన జియోనే టాప్
టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియా వినియోగదారుల సంఖ్య భారీగా తగ్గింది. నవంబర్ 2019లోనే ఏకంగా 3.63 కోట్ల మంది కస్టమర్లు తగ్గారు. దీంతో ప్రస్తుతం ఈ కంపెనీ కస్టమర్ల సంఖ్య 33.63 కోట్లకు చేరుకుంది. అక్టోబర్ నెలలో 1.89 లక్షల మంది వినియోగదారులు పెరిగినట్లు అంతకుముందు కంపెనీ ప్రకటించింది.
బిజినెస్మెన్ అకౌంట్ నుంచి గ్రామాల్లోని జన్ ధన్ అకౌంట్లోకి..
37 కోట్ల నుంచి 33.63 కోట్లకు తగ్గిన యూజర్లు
అక్టోబర్ నెలలో వొడాఫోన్ ఐడియా మొత్తం కస్టమర్ల సంఖ్య 37.26 కోట్లుగా ఉంది. నవంబర్ నెలలో మూడున్నర కోట్లకు పైగా తగ్గడంతో 33.63 కోట్లకు చేరుకుందని ఆ కంపెనీ ట్రాయ్కు ఇచ్చిన రిపోర్టులో తెలిపింది. కస్టమర్లు తగ్గడం పట్ల స్పందన తెలియజేసేందుకు వొడాఫోన్ ఐడియా నిరాకరించింది. మరోవైపు, క్రియాశీలంగా లేని కస్టమర్లను తొలగించడం వల్లే ఈ సంఖ్య భారీగా తగ్గిందని అంటున్నారు. యాక్టివ్ యూజర్లు నమోదు చేసే సమయాన్ని 120 రోజుల నుంచి 90 రోజులకు తగ్గించడం, అది కూడా నవంబర్ నెలలో జరగడంతో ఈ సంఖ్య భారీగా తగ్గిందని చెబుతున్నారు.
అక్టోబర్ నెలలో భారీగా పెరిగిన జియో యూజర్లు..
మరోవైపు, జియో తన కస్టమర్లకు షాకిస్తూ ఛార్జీలను పెంచినప్పటికీ యూజర్ల సంఖ్య మాత్రం పెరుగుతోంది. అక్టోబర్ నెలలో కొత్తగా 91 లక్షల మంది జియో యూజర్లుగా మారారు. దీంతో జియో సబ్స్క్రైబర్ల సంఖ్య 36.43 కోట్లకు చేరుకుంది.
జియో ఛార్జీలు పెంచినా...
ఇతర నెట్ వర్క్లకు చేసే కాల్స్కు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ప్రకటించిన నెలలోనే యూజర్లు జియోకు పెద్ద ఎత్తున పెరగడం గమనార్హం. జియో నుంచి ఇతర నెట్ వర్క్కు చేసే కాల్ పైన నిమిషానికి 6 పైసలు వసూలు చేస్తున్నట్లు అక్టోబర్ 9న ప్రకటించింది. దీనిపై జియో యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ, కొత్త యూజర్ల చేరికపై ఇది ప్రభావం చూపించలేకపోయింది.
అక్టోబర్లో ఎయిర్టెల్, వొడాఫోన్లకూ పెరిగిన యూజర్లు
ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలకు అక్టోబర్ నెలలో సబ్స్క్రైబర్లు పెరిగారు. వొడాఫోన్ ఐడియాకు అక్టోబర్ నెలలో 1.89 లక్షల మంది కొత్త కస్టమర్లు రాగా, ఎయిర్టెల్కు 81,974 మంది వచ్చారు. అక్టోబర్ నెల ముగిసే నాటికి వొడాఫోన్ ఐడియా కస్టమర్లు 37.26 కోట్లు, ఎయిర్టెల్ కస్టమర్లు 32.56 కోట్లుగా ఉన్నారు. అయితే నవంబర్ నెలలో మాత్రం వొడాఫోన్ ఐడియా కస్టమర్లు మూడున్నర కోట్లకు పైగా తగ్గి 33.63 కోట్లకు చేరుకుంది.