రాకపోయినా వేతనం, రూ.30,000 కంటే తక్కువ శాలరీ ఉంటే: ఉద్యోగులకు రిలయన్స్ ఊరట
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని, దేశాన్ని అతలాకుతలం చేస్తోన్న నేపథ్యంలో పారిశ్రామికవేత్తలు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తమ కంపెనీలో వెంటిలెటర్లు తయారు చేస్తామని ఆనంద్ మహీంద్రా ఇటీవల చెప్పారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సైతం అండగా ఉండేందుకు ముందుకు వచ్చారు. ప్రజల కోసం మాస్కుల ఉత్పత్తి, జీవనాధారం కోల్పోయిన వారికి ఉచిత భోజనం, ఎమర్జెన్సీ వాహనాలకు ఉచిత ఇంధనం, 100 పడకల ఆసుపత్రి నిర్మించడంతో పాటు తమ కంపెనీ ఉద్యోగులకు, అలాగే రిలయన్స్ జియో సబ్స్క్రైబర్లకు కూడా ఆఫర్ ఇచ్చారు.
ఉచిత భోజనం, ఇంధనం, 100 బెడ్స్ హాస్పిటల్: రిలయన్స్ సాయం, కరోనా మందుకు ప్రయత్నం
కొత్త బ్రాడ్బ్యాండ్ ఉచితం, పాత కస్టమర్లకు డబుల్ డేటా
కొత్త బ్రాడ్ బ్యాండ్ కస్టమర్లకు బ్రాడ్ బ్యాండ్ ఉచితంగా అందిస్తున్నట్లు జియో తెలిపింది. పాత కస్టమర్లకు డేటా పరిమితిని రెట్టింపు చేస్తున్నట్లు పేర్కొంది. కరోనా నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి ప్రయోజనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ కస్టమర్ కనెక్షన్ పొందడానికి రూ.2,500 చెల్లించాల్సి ఉండగా, వీటిలో రూ.1,500 రిఫండ్ కింద పొందుతారు. ఇప్పుడు మినిమం రీఫండబుల్ డిపాజిట్ తీసుకొని హోమ్ గేట్ వే రూటర్ అందిస్తున్నారు.
నాన్ జియో కాల్స్ పెంపు
డేటా యాడ్ ఆన్ ఓచర్లపై డబుల్ డేటాను అందిస్తుంది. నాన్ జియో వాయిస్ కాల్స్పై కూడా నిమిషాలను పెంచింది. కస్టమర్ల వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కోసం ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ కొత్త కనెక్షన్లకు ఫ్రీ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ అందిస్తోంది.
ఆ ఉద్యోగులకు వేతనాలు చెల్లింపు
కరోనా నేపథ్యంలో మూతపడిన తమ సంస్థలో పని చేసే ఒప్పంద, తాత్కాలిక ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తామని తెలిపింది. మూతబడిన కంపెనీకి సంబంధించిన పలు ప్రాజెక్టుల్లో పని చేస్తోన్న వారికి యథావిధిగా శాలరీ ఉంటుందని పేర్కొంది.
రూ.30వేలకు తక్కువ వేతనం ఉంటే రెండు విడతల్లో
కరోనా మహమ్మారి నేపథ్యంలో నెలకు రూ.30,000 వేతనం కలిగిన తమ కంపెనీ ఉద్యోగులకు ఈ మొత్తాన్ని నెలలో రెండు విడతల్లో అందిస్తామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ వేతనం ఉన్న వారిపై ఒత్తిడి లేకుండా వారికి రెండుసార్లు వేతనం మొత్తాన్ని ఇస్తామని తెలిపింది.
గ్రాసరీ స్టోర్స్
దేశవ్యాప్తంగా ఉన్న 746 గ్రాసరీ స్టోర్స్లలో అన్ని రకాల వస్తువులను సిద్ధంగా ఉంచినట్లు రిలయన్స్ తెలిపింది. ఇవి ఉదయం గం.7 నుండి రాత్రి గం.11 వరకు తెరిచి ఉంటాయని తెలిపింది.
వర్క్ ఫ్రమ్ హోమ్
రిలయన్స్ సంస్థల్లోని దాదాపు చాలామంది ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చింది. జియో నెట్ వర్క్, పెట్రోలియం, గ్రాసరీ ఔట్ లెట్, ఇతర ఎమర్జెన్సీ సేవల్లో ఉన్న వారు తప్ప మిగతా వారు ఇంటి నుండి పని చేయాలని సూచించింది.
కరోనాపై పోరుకు రిలయన్స్
కరోనాపై పోరుకు వివిధ మార్గాల్లో సహకరిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 కోట్ల విరాళం ప్రకటించారు. హెల్త్ వర్కర్ల కోసం వ్యక్తిగత రక్షణ పరికరాలైన సూట్లూ, వస్త్రాలతో పాటు లక్షల ఫేస్ మాస్క్లకు ఉత్పత్తి సామర్థ్యం కూడా పెంచుతామని తెలిపారు. రిలయన్స్ ఫౌండేషన్, రిలయన్స్ రిటైల్, జియో, రిలయన్స్ లైఫ్ సైన్సెస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఫ్యామిలీలోని మొత్తం 6,00,000 మంది సభ్యులను కరోనాపై పోరు కోసం ఉపయోగించుకుంటున్నట్టు తెలిపింది.