రిలయన్స్ అదుర్స్, ప్రపంచ విలువైన కంపెనీల్లో 48వ స్థానం: ఆ కంపెనీల కంటే ముందుకు..
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఘనత సాధించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వ్యాల్యూ కలిగిన టాప్ 50 జాబితాలో చోటు దక్కించుకుంది. స్టాక్ మార్కెట్ లెక్కల ప్రకారం రిలయన్స్ ప్రపంచవ్యాప్తంగా 48వ స్థానంలో నిలిచింది. కంపెనీ మార్కెట్ కాపిటల్ రూ.13 లక్షల కోట్లను దాటింది. నిన్న రిలయన్స్ షేర్ ధర రూ.2,076కు ఎగిసిన విషయం తెలిసిందే. నిన్న ఒక్కరోజే 3.6 శాతం ఎగిసింది.
గుడ్న్యూస్: ఉద్యోగాలు పెరుగుతున్నాయి, ఏ రంగంలో ఎంతంటే? బెంగళూరు, పుణే అదుర్స్!
తొలి భారతీయ కంపనీ..
మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.13 లక్షల కోట్లకు (రూ.13,06,329.39) చేరుకున్న తొలి భారతీయ కంపనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ కావడా గమనార్హం. డాలర్ పరంగా దాదాపు 173 బిలియన్ డాలర్లు. టాప్ 50లో చోటు దక్కించుకున్న కంపెనీ కూడా ఇదే. గత నెల రోజుల కాలంలో రిలయన్స్ ఎం-క్యాప్ రూ.2 లక్షల కోట్లు పెరిగింది. కరోనా కారణంగా మార్చి 23వ తేదీన రూ.867.82 కనిష్టానికి పడిపోయిన షేర్ ధర నిన్న (23, గురువారం) ఏకంగా రూ.2,076 దాటింది. 52 వారాల కనిష్టం రూ.867.82 ఇది. ఆ రోజు నుండి ఇప్పటి వరకు షేర్ ధర 139 శాతం ఎగిసింది.
ప్రపంచ నెం. వన్ సౌదీ ఆరామ్కో.. ఆసియాలో RIL 10
1.7 ట్రిలియన్ డాలర్లతో (రూ.127 లక్షల కోట్లు) సౌదీ ఆరామ్కో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మార్కెట్ క్యాప్ కలిగిన సంస్థగా నిలిచింది. ఆ తర్వాత యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, అల్ఫాబెట్, ఉన్నాయి. షెవ్రాన్, ఒరాకిల్, యూనీలీవర్, బీహెచ్పీ గ్రూప్, డచ్ రాయల్ షెల్, సాఫ్ట్బ్యాంక్ వంటి ప్రపంచ దిగ్గజాలమార్కెట్ వ్యాల్యూ కంటే రిలయన్స్ ఎం-క్యాప్ అధికం. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ క్యాప్ పరంగా 48వ స్థానలో ఉన్న రిలయన్స్.. ఆసియాలో 10వ స్థానంలో ఉంది. చైనాకు చెందిన అలీబాబా గ్రూప్7వ స్థానంలో ఉంది. టాటా గ్రూప్కు చెందిన టీసీఎస్ టాప్ 100లో ఉంది. టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8.14 లక్షలకోట్లు (109 బిలియన్ డాలర్లు). టీసీఎస్ షేర్ ధర రూ.2,170.75 వద్ద ఉంది.
జోరుగా పెట్టుబడులు
రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ విభాగం జియో ప్లాట్ఫాంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో రిలయన్స్ షేర్ అంతకంతకూ పెరిగింది. ఫేస్బుక్, గూగుల్ వంటి దిగ్గజాలు ఇన్వెస్ట్ చేశాయి. 4G/5G నెట్ వర్క్కు వలస వెళ్లాలనుకునే 2G కస్టమర్ల కోసం గూగుల్తో కలిసి తక్కువ ఖర్చుతో కూడిన స్మార్ట్ ఫోన్స్ అభివృద్ధి చేయాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో 5G నెట్ వర్క్ రోల్ అవుట్ కోసం కంపెనీ తన అంతర్గత 5G సొల్యూషన్ను అభివృద్ధి చేసింది. సరికొత్త 5G సాంకేతిక పరిజ్ఞానం ట్రయల్స్ నిర్వహించేందుకు టెలివిజన్ విభాగం నుంచి కొన్ని ఫ్రీక్వెన్సీలలో జియోకు స్పెక్టం ఉండాలి.