టాప్ డిజైనర్ మనీష్ మల్హోత్రా కంపెనీనీ వదలని అంబాని: 40 శాతం రిలయన్స్ పరం
ముంబై: మనీష్ మల్హోత్ర.. ఫ్యాషన్ సెక్టార్లో పరిచయం అక్కర్లేని పేరు. టాప్ డిజైనర్.. కాస్ట్యూమ్స్ స్టైలిస్ట్. ఫిల్మ్ మేకర్ కూడా. అనేక సినిమాలకు కాస్ట్యూమ్స్ డిజైనర్గా పనిచేశారు. కొన్ని సినిమాలను ప్రొడ్యూస్ చేశారు. ఆయన నెలకొల్పిన డిజైనర్ కంపెనీ ఎంఎం స్టైల్స్.. ఇక దేశీయ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబాని పరం కానుంది. ఎంఎం స్టైల్స్లో 40 శాతం మేర వాటాలను కొనుగోలు చేయనున్నారు ముఖేష్ అంబాని.
ఇంధన ధరలు మళ్లీ జూమ్: అక్కడ లీటర్ పెట్రోల్ రూ.116 పైమాటే
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో ఒకటైన రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్.. మనీష్ మల్హోత్ర సంస్థలో 40 శాతం వాటాలను కొనుగోలు చేయనుంది. 16 సంవత్సరాలుగా ఫ్యాషన్ సెక్టార్పై ఆధిపత్యాన్ని కనపరుస్తోన్న ఎంఎం స్టైల్స్లో 40 శాతం మేర పెట్టుబడులు పెట్టడం ద్వారా డిజైనింగ్ రంగంలో కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ అడుగు పెట్టినట్టయింది. దేశవ్యాప్తంగా ఉన్న రిలయన్స్ బ్రాండ్స్ షోరూమ్లల్లో ఇకపై మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన దుస్తులు అందుబాటులోకి వస్తాయి.
దుస్తుల డిజైనింగ్ సెక్టార్లో అడుగు పెట్టాలంటూ నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు తమకు మనీష్ మల్హోత్రా కంటే మంచి ప్రత్యామ్నాయం కనిపించలేదని రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ ఓ ప్రకటనలో తెలిపింది. 16 సంవత్సరాలుగా ఈ సెగ్మెంట్లో సత్తా చాటుతోన్న ఎంఎం స్టైల్స్లో తాము వ్యూహాత్మకంగా భాగస్వామ్యులు కావడం ఆనందంగా ఉందని పేర్కొంది. ఇకపై మనీష్ మల్హోత్రా డిజైన్ చేసే దుస్తులకు అంతర్జాతీయ బ్రాండింగ్ లభిస్తుందని వ్యాఖ్యానించింది.
భారతీయ కళలు, సంస్కృతిని ఆధారంగా చేసుకుని.. దుస్తులను డిజైన్ చేయాలనేది తమ ప్రాథమిక నిర్ణయమని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ ఇషా అంబాని తెలిపారు. ఈ రూపంలో దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రమోట్ చేస్తామని అన్నారు. డిజైనింగ్ రంగంలో మనీష్ మల్హోత్రాకు 31 సంవత్సరాలకు పైగా అనుభవం ఉందని, అది తమ రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ పురోభివృద్ధికి ఉపయోగపడుతుందని అన్నారు.
ఎంఎం స్టైల్స్ను 2005లో నెలకొల్పారు మనీష్ మల్హోత్రా. మన హైదరాబాద్ సహా ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్కత, బెంగళూరు వంటి దాదాపు అన్ని మెట్రో నగరాల్లోనూ ఎంఎం స్టైల్స్ షోరూమ్స్ ఉన్నాయి. 700 మందికి పైగా అందులో పని చేస్తోన్నారు. కాస్ట్యూమ్స్ను డిజైన్ చేయడం, వాటిని తయారు చేయడం.. అన్నీ ఎంఎం స్టైల్స్లోనే ఉంటాయి. బాలీవుడ్ సహా పలు ఫిల్మ్ ఇండస్ట్రీలకు కాస్ట్యూమ్ డిజైనర్గా మనీష్ మల్హోత్రా పని చేశారు. రిలయన్స్ ఆధీనంలోకి వెళ్లిన తరువాత కూడా దీనికి మనీష్ మల్హోత్రా మేనేజింగ్ డైరెక్టర్గా కొనసాగుతారు.