వేగంగా బ్యాంకుల ప్రైవేటీకరణ: వాటా తగ్గించుకోనున్న కేంద్రం: విదేశీ సంస్థలకు 20% రిజర్వ్
న్యూఢిల్లీ: కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం.. తన ప్రైవేటీకరణ విధానాన్ని మరింత ముమ్మరం చేయబోతోంది. దీన్ని మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్లబోతోంది. ఇప్పటికే తన ఆధీనంలో ఉన్న ఎయిరిండియాను అమ్మేసింది. 18 వేల కోట్ల రూపాయలకు టాటా సన్స్కు విక్రయించింది. ఎల్ఐసీ, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, ఐడీబీఐ, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ.. ఇవన్నీ ప్రైవేటుపరం కావడానికి సంసిద్ధంగా ఉన్నాయి. జాతీయ బ్యాంకులను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించడానికి కసరత్తు చేస్తోంది.
అమెరికన్ మార్కెట్పై కన్నేసిన బైజూస్: 4 బిలియన్ డాలర్ల కోసం పబ్లిక్ ఇష్యూ
ఐడీబీఐ అమ్మకానికి..
ఇప్పటికే ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ)ని అమ్మకానికి పెట్టింది. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ నాటికి ముగియనున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఐడీబీఐ, ఎల్ఐసీ ప్రైవేటుపరం కావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ రెండింటి ప్రైవేటీకరణను పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేస్తోంది. జాతీయ బ్యాంకుల ప్రైవేటీకరణ అనేది ఐడీబీఐ వరకు మాత్రమే పరిమితం అయ్యేలా కనిపించట్లేదు. మరింత విస్తరించడం ఖాయం అనే అభిప్రాయాలు వినిపిస్తోన్నాయి.
వాటా కుదింపు..
దీనికి ప్రధాన కారణం- జాతీయ బ్యాంకుల్లో తనకు ఉన్న వాటాలను కేంద్ర ప్రభుత్వం భారీగా తగ్గించుకోబోతోంది. దీనికోసం కసరత్తు చేస్తోంది. దాదాపు 14 జాతీయ బ్యాంకుల్లో ఉన్న తన వాటాలను తగ్గించుకోవడానికి ప్రతిపాదనలను సైతం సిద్ధం చేసింది కేంద్రం ప్రభుత్వం.
వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆరంభం అయ్యే 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రక్రియను చేపట్టొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం జాతీయ బ్యాంకుల్లో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న వాటా 51 శాతం.
సగానికి తగ్గింపు..
దీన్ని 26 శాతానికి తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంటే సగానికి తగ్గించుకోవడం అవుతుంది. ఆ మిగిలిన 25 శాతం వాటాను ప్రైవేటు సంస్థలు లేదా వ్యక్తులకు కట్టబెట్టడం ఖాయమౌతుంది. ప్రైవేటు ఆర్థిక సంస్థలకు జాతీయ బ్యాంకుల్లో అధికవాటాలను కల్పించాలనేది కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తోందని అంటున్నారు. రెండు బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అఖిల భారత బ్యాంక్ ఉద్యోగ సంఘాల సమాఖ్య ప్రతినిధులు పెద్ద ఎత్తున ఆందోళనలను లేవనెత్తారు.
విదేశీ సంస్థలకు 20 శాతం రిజర్వ్
జాతీయ స్థాయిలో రెండు రోజుల పాటు బ్యాంకుల సమ్మెను చేపట్టారు. దీనివల్ల లక్షల కోట్ల రూపాయల ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయాయి. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గేలా లేదు. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రక్రియను మరింత ముమ్మరం చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కంపెనీల చట్టంలోనూ సవరణలు చేయనున్నట్లు చెబుతున్నారు. విదేశీ పెట్టుబడిదారులకు 20 శాతం వాటాను రిజర్వ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు సమాచారం.
బ్యాంకింగ్ సంస్కరణల్లో..
సింగిల్ షేర్ హోల్డర్లకు ఉండే ఓట్ హక్కును 10 శాతానికి మించకుండా చేయొచ్చు. 10 శాతానికి క్యాప్ చేయాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. బ్యాంకుల సంస్కరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను చేసినట్లు చెబుతున్నారు. దీనివల్ల బ్యాడ్ లోన్స్ను తగ్గించడం కొత్త రుణాల మంజూరును మరింత సరళీకరించినట్టవుతుందని అంచనా వేస్తోన్నారు. ఈ ప్రతిపాదనలపై అఖిల భారత బ్యాంకు ఉద్యోగ సంఘాల సమాఖ్య ప్రతినిధులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోన్నారు. బ్యాంకింగ్ సెక్టార్లో కేంద్రం తన వాటాలను కుదించుకోవడం ఏ మాత్రం మంచిది కాదని అంటున్నారు.