భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు, సెన్సెక్స్ 627 పాయింట్లు డౌన్
ముంబై: స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాల్లో ముగిశాయి. వరుసగా రెండు రోజుల పాటు భారీ లాభాల్లో ముగిసిన సూచీలు, నేడు అంతేస్థాయిలో నష్టపోయాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగియగా, ఆసియా మార్కెట్లు సైతం ప్రతికూలంగానే కదలాడాయి. దీనికి తోడు రెండు రోజుల భారీ ర్యాలీ కారణంగా ఇన్వెస్టర్లు నేడు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. కరోనా టీకా వచ్చినప్పటికీ ప్రస్తుత ఏడాదిలో భారత్లో ఆర్థిక కార్యకలాపాల ఉత్పత్తి 2019 స్థాయి కంటే తక్కువగానే ఉండవచ్చునని ఐక్య రాజ్య సమితి అంచనా వేసింది. ద్రవ్యోల్బణం ఆందోళనకరంగా ఉందని మూడీస్ పేర్కొంది. ఇది ఈ పరిణామాల నేపథ్యంలోనే నేడు మార్కెట్లు నేలచూపులు చూశాయి. వీటికి తోడు కీలక రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలకు ఏ దశలోనూ మద్దతు దొరకలేదు.
సెన్సెక్స్ 600 పాయింట్లు డౌన్
సెన్సెక్స్ నేడు ఉదయం 50,049.12 పాయింట్ల వద్ద ప్రారంభమై, 50,050.32 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 49,442.50 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నేడు సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా కదలాడింది. సెన్సెక్స్ నేడు 627.43 (1.25%) క్షీణించి 49,509.15 పాయింట్ల వద్ద కదలాడింది. నిఫ్టీ 14,811.85 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,813.75 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,670.25 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 154.40 (1.04%) పాయింట్లు క్షీణించి 14,690.70 పాయింట్ల వద్ద ముగిసింది.
టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో GAIL 2.38 శాతం, UPL 2.21 శాతం, గ్రాసీమ్ 1.96 శాతం, ITC 1.84 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.75 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో HDFC 4.13 శాతం, HDFC బ్యాంకు 3.86 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 2.58 శాతం, టెక్ మహీంద్రా 2.50 శాతం, కోల్ ఇండియా 1.96 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో HDFC బ్యాంకు, టాటా స్టీల్, టాటా మోటార్స్, రిలయన్స్, SBI ఉన్నాయి.
నష్టాలకు కారణాలివే...
అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉన్నాయి. యూఎస్ బాండ్ యీల్డ్స్ గరిష్టాన్ని తాకాయి. డాలర్ సూచీ బలపడింది. ఏషియా స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. జపాన్ ఫిబ్రవరి ఫ్యాక్టరీ నెంబర్స్ క్షీణించాయి. ఈ ప్రభావం అన్ని మార్కెట్లపై పడింది. నిక్కీ 225 దాదాపు 0.80 శాతం, కోస్పీ 50 సూచీ 0.28 శాతం, షాంఘై కాంపోజిట్ 0.43 శాతం నష్టపోయాయి.