FY21లో జీడీపీ క్షీణత 7.3 శాతం కాదు, 6.6 శాతం, పన్ను రాబడి జంప్
నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్(NSO) సోమవారం విడుదల చేసిన సవరించిన డేటా ప్రకారం, కరోనా ఆర్థిక సంవత్సరం 2020-21లో భారత ఆర్థిక వ్యవస్థ అంచనాల కంటే తక్కువగా క్షీణించింది. సోమవారం నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను లోకసభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ సర్వే ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.3 శాతం మేర క్షీణిస్తుందని మే నెలలో అంచనా వేయగా, ఇది మైనస్ 6.6 శాతంగా మాత్రమే ఉందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కరోనా సమయంలో అనుకున్నంత దారుణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినలేదని తెలిపింది.
వాస్తవ జీడీపీ లేదా 2011-12 స్థిర ధరల వద్ద జీడీపీ 2020-21, 2019-20 ఏడాదులకు వరుసగా రూ.135.58 లక్షల కోట్లు, రూ.145.16 లక్షల కోట్లకు చేరుకుంది. అంటే 2020-21 ఆర్థిక సంవత్సరంలో 6.6 శాతం మేర క్షీణించింది. 2021 జనవరి సవరణలో 2019-20 రియల్ జీడీపీలో 4 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేశారు. 201-20లో తలసరి ఆదాయం రూ.1,32,115 కాగా, 2020-21లో రూ.1,26,855గా నమోదయింది.
2021 ఏప్రిల్-నవంబర్ కాలంలో ఏడాది ప్రాతిపదికన ఆదాయం 67.2 శాతం పెరిగింది. వాస్తవానికి 202122 బడ్జెట్ అంచనాల్లో 9.6 శాతం వృద్ధిని అంచనా వేశారు. ప్రత్యక్ష, పరోక్ష పన్ను వసూళ్లు రెండు పెరిగాయి. ఆర్బీఐ మిగులు నిధులు రూ.99,000 కోట్లను ప్రభుత్వానికి బదలీ చేయడంతో పన్నేతర రాబడి పెరిగింది. స్థూలంగా పన్ను రాబడి 2021 ఏప్రిల్-నవంబర్ కాలంలో 50 శాతం మేర పెరిగింది. కరోనా ముందు కంటే పన్ను రాబడి మెరుగ్గా ఉంది.