కరోనా దెబ్బతో RBI కీలక నిర్ణయం, మార్కెట్లోకి రూ.10,000 కోట్లు
కరోనా మహమ్మారి నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. తమ తమ దేశ ఆర్థిక వ్యవస్థకు అండగా ఉండేందుకు ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు చర్యలు తీసుకుంటున్నాయి. ఆర్బీఐ కూడా కీలక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా తాజా పరిణామాలను ఎదుర్కోవడానికి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ (OMO) ద్వారా రూ.10వేల కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయనుంది.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వాన్ని కొనసాగించేందుకు, రెండు నుంచి ఐదేళ్ల కాలపరిమితితో రూ.10,000 కోట్ల ప్రభుత్వ సెక్యూరిటీలను మార్చి 20వ తేదీన కొనుగోలును ప్రారంభించనున్నట్లు తెలిపింది. అన్ని మార్కెట్లు స్థిరంగా ఉండేలా చూడటం ముఖ్యమని ఆర్బీఐ పేర్కొంది. ఆర్బీఐ కొనుగోలు నిర్ణయాన్ని ప్రకటించడంతో బెంచ్ మార్క్ పదేళ్ల బాండ్ దిగుబడి 6.24 శాతానికి పడిపోయింది.
'కోవిడ్-19 మహమ్మారితో ఆర్థిక మార్కెట్లకు ముప్పు పొంచి ఉంది. స్థిరత్వం లోపించకుండా, సాధారణంగా నడిచేందుకు కావాల్సిన చర్యలను తీసుకుంటున్నామ'ని ఆర్బీఐ బుధవారం ప్రకటనలో తెలిపింది. బహుళ ధరల పద్ధతి వినియోగిస్తూ వేర్వేరు సెక్యూరిటీస్ వేలం ద్వారా రూ.10,000 కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీస్ కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది.
నిమిషాల్లోనే ఉచితంగా పాన్కార్డు తీసుకోండి, ఇలా చేయండి
ఫిబ్రవరి 15, 2022 మెచ్యూరిటీపై 8.20% శాతం, ఏప్రిల్ 16, 2023పై 7.37%, జనవరి 28, 2024పై 7.32%, మే 25, 2025 మెచ్యూరిటీపై 7.72% చొప్పున కూపన్ రేటుతో సెక్యూరిటీస్ కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. డాలర్తో రూపాయి మారకం విలువ బలోపేతానికి ఈ నెల 16న 2 బిలియన్ డాలర్లను రూపాయి కొనుగోలు ద్వారా మార్కెట్లోకి పంప్ చేసింది. 23న మరో విడతలో 2 బిలియన్ డాలర్లు విక్రయించనుంది.