కొత్త నియామకాలు.. నేటి నుండి RBI ఎంపీసీ భేటీ: వడ్డీ రేట్లు యథాతథం!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీని అక్టోబర్ 9వ తేదీన ప్రకటించనుంది. అక్టోబర్ 7వ తేదీ నుండి అక్టోబర్ 9వ తేదీ వరకు ద్రవ్య విధాన కమిటీ(MPC) సమావేశమవుతుందని ఆర్బీఐ ప్రకటనలో తెలిపింది. చివరి రోజు MPC తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడిస్తారు. వాస్తవానికి MPC ద్వైమాసిక సమావేశం గత నెల 29వ తేదీనే జరగాల్సి ఉంది. ఇండిపెండెంట్ సభ్యుల నియామకం జరగకపోవటం పాటు కనీసం నలుగురు సభ్యుల కోరమ్ లేని కారణంగా సమావేశం వాయిదా పడింది.
భారత బ్యాంకుల నష్టాలు తగ్గించాలంటే అది కీలకం: ఫిచ్, ప్రభుత్వ హామీపై..
అందుకే కమిటీ సమావేశం ఆలస్యం
కమిటీలో చేతన్ ఘటే, పమీదువా, రవీంద్ర దోలకియాల నాలుగేళ్ల పదవీకాలం సెప్టెంబర్ 29వ తేదీన ముగిసింది. వీరి స్థానంలో ప్రముఖ ఆర్థికవేత్తలు అషిమా గోయల్, జయంత్ ఆర్ వర్మ, శషాంక్ బిడేలను నియమించింది. దీంతో MPC సమావేశం ఖరారు అయింది. ఆర్బీఐ చట్టం ప్రకారం బోర్డులో ఎక్స్టర్నల్ సభ్యుల పదవీ కాలం నాలుగేళ్లు. తిరిగి నియమితులయ్యేందుకు అర్హత లేదు. దీంతో వారి స్థానంలో కొత్తవారిని నియమించారు. గత ద్వైమాసిక సమావేశం (ఆగస్ట్)లో వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇప్పుడు కూడా యథాతథంగా ఉంచవచ్చునని భావిస్తున్నారు.
వడ్డీ రేట్ల జోలికి వెళ్లకపోవచ్చు
రిటైల్ ద్రవ్యోల్బణం అధికంగానే ఉన్నందున ఈసారి కూడా రెపో రేటు యథాతథస్థితికి ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలు ఉంటాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. గత కొన్ని నెలలుగా సరఫరాల పరమైన లోపాల కారణంగా రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం కన్నా అధికంగానే ఉంటోంది. రెపో రేటు నిర్ణయానికి MPC రిటైల్ ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. కాబట్టి కీలక వడ్డీ రేట్ల జోలికి వెళ్లకపోవచ్చునని అంటున్నారు.
వడ్డీ రేట్లపై బ్రోకరేజీ సంస్థ
కొత్త సభ్యులు MPCని రెపో రేట్ల విషయంలో తటస్థం లేదా సడలింపు దిశగానే నడిపించవచ్చునని జపాన్ బ్రోకరేజీ సంస్థ నోమురా అంచనా వేసింది. అదే సమయంలో ఆర్బీఐ వైఖరిలో తక్షణ మార్పుకు ఆస్కారం లేదని కూడా పేర్కొంది. 2016లో MPC ఏర్పాటయిన తర్వాత జరుగుతున్న 24వ సమావేశం ఇది. వడ్డీరేటు పాత్రను నిర్ణయించేందుకు 2016లో ఆరుగురు సభ్యుల MPCకి మార్చింది ప్రభుత్వం. ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలోని ప్యానెల్లో సగం ఇండిపెండెంట్ సభ్యులు ఉంటారు.