బ్యాంకులపై కస్టమర్ల ఫిర్యాదు, పరిష్కారం: RBI రిపోర్ట్ ఇదీ
ముంబై: బ్యాంకు సేవలపై కస్టమర్ల ఫిర్యాదులు పెరుగుతున్నాయి. 2020 జూన్ 30వ తేదీతో ముగిసిన ఏడాది కాలంలో ఫిర్యాదులు ఏకంగా యాభై ఎనిమిది శాతం పెరిగి 3.08 లక్షల కోట్లకు చేరినట్లు ఆర్బీఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జూలై నుండి జూన్ కాలాన్ని ఆర్బీఐ సంవత్సర కాలంగా పాటిస్తుంది. కస్టమర్ల నుండి వస్తున్న ఫిర్యాదుల్లో ఇరవై శాతం ఏటీఎంలు లేదా డెబిట్ కార్డులకు సంబంధించినవి ఉన్నాయి. తర్వాత మొబైల్ లేదా ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్కు సంబంధించి 13.38 శాతంగా ఉన్నట్లు తేలింది.
క్రెడిట్ కార్డులు, నోటీసులు లేకుండా లెవీ ఛార్జీలు విధించడంపై గత ఏడాది ఫిర్యాదులు పెరిగాయి. అంతకుముందు ఏడాది 195,901లతో పోలిస్తే ఈ ఏడాది బ్యాంకులపై మొత్తం 308,630 ఫిర్యాదులు అందాయి. వీటిలో 48,333 ఫిర్యాదులతో దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బీఐ అగ్రస్థానంలో ఉంది. హెచ్డీఎఫ్సీ 15,004, ఐసీఐసీఐ బ్యాంకు 11, 844, యాక్సిస్ బ్యాంకు 10,457, PNB 9,928పై ఫిర్యాదులు రాగా, అంబుడ్స్మెన్ పరిష్కరించింది.
ఇక ఎన్బీఎఫ్సీలపై ఫిర్యాదులు 387 శాతం పెరిగాయి. గత ఏడాది 3991తో పోలిస్తే మొత్తం 19,432 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో అధికంగా బజాజ్ ఫైనాన్స్ పైన నమోదయ్యాయి. కంపెనీపై అంబుడ్స్మెన్కు ఏకంగా 4,979 ఫిర్యాదులు వచ్చాయి. 300 ఫిర్యాదులతో ఇండియాబుల్స్ కన్స్యూమర్ ఫైనాన్స్ రెండో స్థానంలో ఉంది. హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫులర్టన్ ఇండియా క్రెడిట్ కంపెనీ ఆ తర్వాత ఉన్నాయి.