రుణాలతో సామాన్యుల ఇక్కట్లు: ఆ 1913 మంది మాత్రం రూ.1.46 లక్షల కోట్లు ఎగ్గొట్టారు!
2020 జూన్ నాటికి 1,913 మంది, రూ.1.46 లక్షల కోట్ల బ్యాంకు రుణాలను ఉద్దేశ్యపూర్వకంగా ఎగవేశారు. ఇందులో ప్రభుత్వరంగ SBIకి రూ.43,887 కోట్లు రావాల్సి ఉంది. పుణేకు చెందిన వివేక్ వేలంకర్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం (RTI) కింద కోరగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సమాచారాన్ని వెల్లడించింది. ఇందులో 264 మంది ఒక్కొక్కరు రూ.100 కోట్లు అంతకంటే ఎక్కువ ఎగవేతదారులు ఉన్నారు. వీరు ఎగవేసిన మొత్తం రూ.1,08,527 కోట్ల వరకు ఉంది. ఇందులో 23 మంది రూ.1,000 కోట్లు అంతకంటే ఎక్కువగా రుణాలు ఎగ్గొట్టారు. వీరి నుండి రూ.43,324 కోట్లు రావాల్సి ఉంది.
పెద్ద బ్యాంకులు సరే.. సేవింగ్స్ అకౌంట్పై ఈ బ్యాంకులు మంచి ఆఫర్
ఎన్ని కోట్లు ఎంతమంది అంటే?
రూ.1,000 కోట్లు అంతకంటే ఎక్కువ రుణాలు తీసుకున్న వారు 23 మంది ఉన్నారు. వారి నుండి రూ.43వేల కోట్లకు పైగా రావాలి.
రూ.500 కోట్ల నుండి రూ.1,000 కోట్ల మధ్య బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారులు 34 మంది ఉన్నారు. వీరి నుండి రావాల్సిన మొత్తం రూ.22,105 కోట్లుగా ఉంది.
రూ.100 కోట్ల నుండి రూ.500 కోట్ల మధ్య 207 మంది ఎగవేతదారులు ఉన్నారు. వీరి నుండి రూ.43,095 కోట్లు రావాలి.
ఎవరి నుండి ఎంత రావాలంటే
ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారుల్లో గీతాంజలి జెమ్స్కు చెందిన మెహుల్ చోక్సీ రూ.5,747.05 కోట్లు, గిలి ఇండియా లిమిటెడ్ రూ.1,446 కోట్లు, నక్షత్ర బ్రాండ్ లిమిటెడ్ రూ.1,109.16 కోట్లు ఉన్నారు. ఆర్ఈఐ ఆగ్రో లిమిటెడ్ రూ.3,516 కోట్లు, ఫ్రోస్ట్ ఇంటర్నేషనల్ రూ.3,097.64 కోట్లు, విన్సమ్ డైమండ్స్ అండ్ జ్యువెల్లరీ రూ.2,975.73 కోట్లు, రోటోమాక్ గ్లోబల్ రూ.2,530.95 కోట్లు ఉన్నాయి. టాప్ 10 ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారుల్లో ఖుదోస్ కెమి రూ.1,948.12 కోట్లు, ఏబీజీ షిప్యార్డ్ రూ.1,874.90 కోట్లు, ట్రాన్ట్రాయ్ రూ.1,861.11 కోట్లు, ఫరెవర్ ప్రిసియస్ రూ.1,653.25 కోట్లు, విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ రూ.1,335.26 కోట్లు ఉన్నాయి.
సామాన్యులు ఇబ్బందులు పడుతుంటే
బ్యాంకుల నుండి తీసుకున్న సాధారణ రుణగ్రహీతలు అప్పులు, వడ్డీలు చెల్లించడానికి ఇబ్బందులు పడుతున్నారని, ఒక నెల ఈఎంఐ ఆగిపోతే వారికి మళ్లీ రుణాలు రావడం ఇబ్బందికరంగా మారిందని, అలాంటి పరిస్థితుల్లో వేలకోట్లు తీసుకున్న ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారులు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని, ప్రధానంగా పబ్లిక్ సెక్యార్ బ్యాంకులకు పెద్ద మొత్తంలో రావాల్సి ఉందని AIBEA జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం అన్నారు.