మీ చేతికి ఎక్కువ డబ్బు: బంగారు ఆభరణాల రుణాలపై ఆర్బీఐ గుడ్న్యూస్
ముంబై: కరోన వైరస్ కేసుల పెరుగుదల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం అన్నారు. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్నప్పటికీ కరోనా కేసుల పెరుగుదల కారణంగా లాక డౌన్లు విధించవలసి వస్తోందన్నారు. పంపిణీ వ్యవస్థలకు అడ్డంకులు తలెత్తడంతో వివిధ రంగాల్లో ద్రవ్యోల్భణ ఒత్తిడి పెరుగుతోందన్నారు. నాబార్డ్, నేషనల్ హౌసింగ్ బ్యాంక్లకు రూ.10,000 కోట్ల లిక్విడిటీని అందిస్తామని తెలిపారు. ద్రవ్యలోటు ఇబ్బందులు ఎదుర్కొంటున్న NBFCs, హౌసింగ్ సెక్టార్కు చేయూతనిస్తామన్నారు.
వడ్డీరేట్లు యథాతథం: రెపో రేటు 4%, రివర్స్ రెపో 3.35%
లోన్ టు వ్యాల్యూ రుణ పరిమితి పెంపు
ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో నగదును ఖర్చు పెట్టేందుకు వెనుకాడుతున్న ప్రజలు, మరోవైపు భారీగా పెరుగుతున్న బంగారం ధరలు. దీంతో చేతిలో నగదు లేక చాలామంది తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. గత కొన్ని నెలలుగా సేల్స్ లేక ఆభరణాల రంగమూ ద్రవ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ రంగానికి, అలాగే సామాన్యులకు ఆర్బీఐ గవర్నర్ ఊరట కలిగించే వార్త చెప్పారు. జ్యువెల్లరీపై లోన్ టు వ్యాల్యూను(విలువ ఆధారిత రుణం) 90 శాతానికి పెంచుతున్నట్లు తెలిపారు. ఇది ప్రస్తుతం 75 శాతంగా ఉంది. దీనిని తొంబై శాతానికి పెంచుతున్నారు. వ్యవసాయేతర ప్రయోజనాల కోసం ఆభరణాలపై ఇచ్చే రుణాలను కరోనా నేపథ్యంలో పదిహేను శాతం పెంచుతున్నట్లు తెలిపారు. ఈ సడలింపు మార్చి 31, 2021 వరకు అందుబాటులో ఉంటుంది.
ప్రోత్సాహక పథకాలు..
MPC సమావేశంలో ప్రాధాన్యతా రంగాలపై సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. బ్యాంకుల కోసం ప్రోత్సాహక పథకాన్ని ప్రారంభించనున్నామన్నారు. సమీప భవిష్యత్తులో ఆర్బీఐ ఇన్నోవేషన్ హబ్ను ఏర్పాటు చేయనుందన్నారు. డిజిటల్ చెల్లింపుల కోసం ఆన్లైన్ డిస్ప్యూట్ మెకానిజం ప్రవేశ పెడతామని తెలిపారు. కరోనాపై పోరు చేస్తున్నామని, ఈ సవాళ్లను మరింత ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటామన్నారు. ధైర్యం, విశ్వాసం కరోనాను జయిస్తాయన్నారు.
చెక్కుల సేఫ్టీ కోసం..
చెక్కు చెల్లింపుల సేఫ్టీ కోసం రూ.50వేలు, అంతకంటే ఎక్కువ విలువైన అన్ని చెక్కులకు పాజిటివ్ పే చెల్లింపు విధానాన్ని ప్రవేశ పెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇది మొత్తం చెక్కులలో వ్యాల్యూమ్ పరంగా దాదాపు 20 శాతం కాగా, వ్యాల్యూ పరంగా 80 శాతంగా ఉంటుంది. దీనికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేస్తామన్నారు.
అదుపులో ద్రవ్యోల్భణం
ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రేట్లు యథాతథంగా ఉంచింది ఆర్బీఐ. రివర్స్ రెపో రేటు, రెపో రేటులో మార్పులు చేయలేదు. రెపో రేటు 4 శాతం, రివర్స్ రెపో రేటును 3.35 శాతం ఉండగా ఎలాంటి మార్పులు చేయలేదు. బ్యాంకు రేటు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటును 4.25 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. వరుసగా నాలుగో నెలలో దేశీయ వస్తువుల ఎగుమతులు తగ్గాయి. కరోనా వల్ల ఆశించిన వృద్ధి నమోదు కాలేదన్నారు. ద్రవ్యోల్భణం అదుపులోనే ఉందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు బలహీనంగా ఉన్నట్లు తెలిపారు.