RBI: మరోసారి వడ్డీ రేట్లను పెంచిన రిజర్వు బ్యాంక్.. ఏకంగా 50 పాయింట్లు పెంపు.. భారంగా రుణాలు..
Repo Rate Hike: ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుదల చాలా సంక్షోభంగా మారుతోంది. దేశంలోను దీని పెరుగుదల చాలా ఆందోళనను కలిగిస్తోంది. దీనిని అదుపు చేసేందుకు రిజర్వు బ్యాంక్ గత కొంత కాలంగా వడ్డీ రేట్లను పెంచుతూనే ఉంది. ఈ క్రమంలో మూడోసారి వరుసగా వడ్డీ రేట్ల పెంపును ప్రకటించింది.
అందరి అంచనాలను మించి ఏకంగా 50 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును పెంచేసింది. దీని కారణంగా రుణాలు భారంగా మారనున్నాయి.
వరుసగా మూడో సారి పెంపు..
చాలా కాలం తరువాత దేశంలో రెపో రేటును పెంచుతూ రిజర్వు బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మే నెలలో రెపో రేటును పెంచటానికి ముందుగా రెపోరేటు 4 శాతంగా ఉంది. ప్రతి రెండు నెలలకు ఒకసారి వడ్డీ రేట్లపై సమీక్ష నిర్వహించి RBI మే 4, 2022న నెలలోపే వడ్డీ రేట్ల పెంపుకు దిగింది. అప్పట్లో తొలిసారి 40 బేసిస్ పాయింట్ల పెంపుతో.. అప్పట్లో తొలిసారిగా రెపోరేటు 4.40 శాతానికి చేరుకుంది. ఆ తరువాత జూన్ 8, 2022న వడ్డీ రేటును 50 బేసిస్ పాయింట్ల పెంపుతో రెపోరేటు 4.90 శాతానికి చేరుకుంది. మూడోసారి 35 పాయింట్లు పెంచవచ్చని అందరూ అంచనా వేసినప్పటికీ 50 బేసిస్ పాయింట్లను పెంచుతున్నట్లు కమిటీ ప్రకటించింది. దీంతో ఈ రేటు 5.40 శాతానికి చేరుకుంది.
జీడీపీ వృద్ధి అంచనా..
రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ తన ప్రసంగంలో MPC రేటు పెంపుకు ఏకగ్రీవంగా అంగీకరించినట్లు తెలిపారు. ఈ క్రమంలో స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (SDF) రేటు 5.15 శాతానికి, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF) రేటు, బ్యాంక్ రేటును 5.65 శాతానికి పెంచినట్లు ప్రకటించింది. ఇదే సమావేశంలో జీడీపీ వృద్ధి రేటును 7.20 శాతం వద్ద కొనసాగించింది.
భారంగా మారనున్న రుణాలు..
రిజర్వు బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించటంతో హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, టర్మ్ లోన్స్, కార్ లోన్స్, వెహికల్ లోన్స్ తో పాటు ఎంసీఎల్ఆర్ లింక్డ్ లోన్స్ రేట్లను బ్యాంకులు పెంచుతాయి. ఇదిలా ఉండగా ఫిక్స్ డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను కూడా త్వరలో బ్యాంకులు పెంచవచ్చు. నేటి రేట్ల పెంపు నిర్ణయం రుణ గ్రహీతలకు చేదు వార్త అయినప్పటికీ.. పొదుపు చేసుకునేవారికి మాత్రం శుభవార్త అని చెప్పుకోవాలి.