RBI repo rate: బ్యాంకింగ్ షేర్లు జూమ్.. పడిలేచిన స్టాక్ మార్కెట్
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరిగ్గా నెల రోజుల వ్యవధిలో మరోసారి బిగ్ షాక్ ఇచ్చింది. రెపో రేట్ను మళ్లీ పెంచింది. ఈ సారి మరింత అధికంగా వడ్డించింది. ఇదివరకు 40 బేసిస్ పాయింట్ల మేర పెంచగా.. తాజాగా ఇప్పుడు ఈ సంఖ్యను 50కి పెంచింది. 50 బేసిస్ పాయింట్లను పెంచింది. ఫలితంగా రెపో రేట్ 4.9 శాతానికి పెరిగింది. దీని ప్రభావం వడ్డీ రేట్ల మీద విపరీతంగా పడింది. బ్యాంకులన్నీ తమ వడ్డీ రేట్లను మరోసారి సవరించడం ఖాయంగా కనిపిస్తోంది.
మరోసారి వడ్డింపు..
ఇప్పటికే అన్ని బ్యాంకులు ఈ బాటలో నడిచాయి కూడా. స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా, హౌసింగ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్.. ఇలా పబ్లిక్, ప్రైవేట్ సెగ్మెంట్లో ఉన్న బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ కార్పొరేషన్లు తమ వడ్డీ రేట్లను పెంచాయి. మార్జినల్ కాస్ట్ లిమిట్ రేట్, ఆర్పీఎల్ఆర్.. ఇదివరకే పెంచాయి. ఇప్పుడు మళ్లీ వాటిని సవరించడానికి సమాయాత్తమౌతున్నాయి.
బ్యాంకింగ్ షేర్లు జూమ్..
తాజాగా రిజర్వుబ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించిన రేపోరేట్ ప్రభావం.. ఇవ్వాళ బ్యాంకింగ్ సెగ్మెంట్కు చెందిన షేర్ల మీద సానుకూలంగా పడింది. బ్యాంకింగ్ షేర్లల్లో భారీ కదలిక కనిపించింది. బ్యాంకింగ్ నిఫ్టీ షేర్లు గ్రీన్జోన్లో ట్రేడ్ అయ్యాయి. దాదాపుగా ఈ సెగ్మెంట్కు చెందిన షేర్లన్నీ అప్పర్ సర్క్యుట్కు వెళ్లాయి. మంగళవారం నాటి క్లోజింగ్ ట్రేడింగ్తో పోల్చుకుని చూస్తే- 2 నుంచి 3 శాతం వరకూ వాటి షేర్ల ధరలు పెరిగాయి.
బ్యాంకెక్స్.. బ్యాంకింగ్ నిఫ్టీ జోష్..
శక్తికాంత దాస్ ఎంపీసీ రివ్యూ వివరాలను ప్రకటించడానికి ముందే.. అంటే 45 నిమిషాల ముందు నుంచే బ్యాంకింగ్ షేర్లల్లో పెరుగుదల చోటు చేసుకుంది. బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో బ్యాంకెక్స్.. 135 పాయింట్ల మేర లాభపడింది. 40,511 పాయింట్లకు పైగా ట్రేడ్ అయింది. బ్యాంకింగ్ నిఫ్టీ కూడా అదే బాటలో నడిచింది. బ్యాంక్ నిఫ్టీ 87 పాయింట్లు లాభపడింది. 35,082 పాయింట్ల వద్ద ట్రేడింగ్ కనిపించింది. మొత్తంగా ఇవ్వాళ మార్కెట్ నష్టాల్లో ఆరంభమైనప్పటికీ.. బ్యాంకింగ్ షేర్లు లాభపడ్డాయి.
పడిలేచిన స్టాక్స్
ఈ ఉదయం స్టాక్ మార్కెట్స్ 80 పాయింట్ల నష్టంతో ఆరంభం అయ్యాయి. ఈ నంబర్.. క్రమంగా పెరుగుతూ వెళ్లింది. 350 పాయింట్ల వరకు నష్టపోయింది. అన్ని కీలక సెగ్మెంట్స్కు చెందిన షేర్లు నష్టపోయాయి. అది ఎంతోసేపు కనిపించలేదు. శక్తికాంత దాస్ ఎంపీసీ ఫలితాలను ప్రకటించిన తరువాత రీబౌండ్ అయింది మార్కెట్. ఒక్కసారిగా గ్రాఫ్ ఆకాశానికి ఎగబాకింది. 350 పాయింట్ల నష్టాన్ని పూడ్చుకుని మరీ దూసుకెళ్లింది. తొలిగంట ముగిసే సమయానికి వందపాయింట్ల లాభంతో ట్రేడింగ్ కావడం కనిపించింది.