ఆర్బీఐ కీలక నిర్ణయం, ప్రయివేటు బ్యాంకుల్లో గణనీయ మార్పులు
ఇండియన్ ప్రయివేటురంగ బ్యాంకుల్లో యాజమాన్యం, నియంత్రణకు సంబంధించి విధానాలను సమీక్షించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఆర్బీఐ శుక్రవారం ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీకే మొహంతీ అధ్యక్షతన ఐదుగురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్... ప్రయివేటు బ్యాంకుల యాజమాన్య, కార్పోరేట్ స్ట్రక్టర్ను సమీక్షించనుంది.
ఆదాయం తగ్గి, ఉద్యోగాలు పోతాయ్: అలా ఐతే ఎక్కువ ఉద్యోగుల్ని కాపాడవచ్చు
సెప్టెంబర్ 30 నాటికి నివేదిక
పీకే మొహంతీ అధ్యక్షతన ఏర్పాటైన ఈ బృందంలో ఆర్బీఐ సెంట్రల్ బోర్డు డైరెక్టర్ సచిన్ చతుర్వేది, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు లిల్లీ వడేరా, ఎస్సీ ముర్ము ఉండగా, ప్యానెల్ కన్వీనర్గా చీప్ జనరల్ మేనేజర్ మోహన్ యాదవ్ను నియమించారు. ఆర్బీఐ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30వ తేదీ నాటికి ఈ కమిటీ నివేదిక సమర్పిస్తుంది. ప్రయివేటు బ్యాంకుల్లో యాజమాన్యానికి సంబంధించిన నియంత్రణ, లైసెన్స్ నిబంధనలను సమీక్షించాలని ఆర్బీఐ.. ప్యానెల్ను కోరింది.
వీటిని సమీక్షిస్తుంది
ప్రయివేటు బ్యాంకుల ఓనర్షిప్, నియంత్రణ వైవిధ్యంగా ఉండాలని, ఈ బ్యాంకుల్లోని యాజమాన్యం, పాలన, కార్పోరేట్ నిర్మాణంలోని మార్గదర్శకాలను సమగ్రంగా సమీక్షించాల్సిన అవసరం ఉందని, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటామని ఆర్బీఐ చెబుతోంది. ప్రయివేటురంగ బ్యాంకుల యాజమాన్యం, నియంత్రణపై ప్రస్తుతం ఉన్న లైసెన్సింగ్ మార్గదర్శకాలను, నిబంధనలను ఈ బృందం పరిశీలిస్తుంది. యాజమాన్య అధిక నియంత్రణ అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది. దీంతో పాటు బ్యాంకింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి వ్యక్తులు లేదా సంస్థలకు అర్హత ప్రమాణాలను పరీశిలిస్తుంది.. సమీక్షిస్తుంది. ప్రారంభ లైసెన్సింగ్ దశలోనే ప్రమోటర్ వాటా నిబంధనలను సమీక్షిస్తుంది.
వాటా నిబంధనలు పరిశీలించి..
ప్రమోటర్ల వాటాకు సంబంధించి ప్రస్తుత నిబంధనలను కూడా పరిశీలించి ప్యానెల్ తగిన సుఫార్సులు చేస్తుంది. కొటక్ మహీంద్ర బ్యాంకులో నిబంధనల కంటే అధిక వాటా ప్రమోటర్లకు ఉండటంతో, ఆర్బీఐ-బ్యాంకు మధ్య కోర్టు బయట ఒప్పందం జరిగింది. కొటక్ బ్యాంకులో ప్రమోటర్లు 26 శాతం వాటాను కొనసాగించేందుకు అనుమతిస్తూ ఓటింగ్ హక్కులను 1 శాతం వాటాలకు మాత్రమే ఆర్బీఐ ఆగస్టులో పరిమితం చేసింది. బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత మూడేళ్లకు ప్రమోటర్ల వాటా 40 శాతానికి, పదేళ్లకు 20 శాతానికి, 15 ఏళ్లకు 15 శాతానికి తగ్గించుకోవాల్సి ఉంటుందని ప్రస్తుత నిబంధనలు ఉన్నాయి. కొటక్ మహీంద్రలాగే తాము 26 శాతానికి పెంచుకోవడానికి అనుమతివ్వాలని ఇండస్ ఇండ్ బ్యాంకు ప్రమోటర్లు హిందూజా సోదరులు ఆర్బీఐకి దరఖాస్తు చేసుకున్నారు. ఆర్బీఐ నిర్ణయంతో పలు ప్రయివేటు బ్యాంకుల యాజమాన్య, నియంత్రణ విషయంలో గణనీయ మార్పులు చూడవచ్చు.