RBI MPC meeting: వడ్డీ రేట్లు యథాతథంగా ఉండే అవకాశం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈసారి కీలక వడ్డీ రేట్లలో మార్పులు చేయకపోవచ్చునని ఆర్థిక నిపుణుల అంచనా. ఆర్బీఐ పరపతి విధాన కమిటీ సమావేశం బుధవారం (జూన్ 3) ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలను శుక్రవారం రోజున ఆర్బీఐ వెల్లడిస్తుంది. కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలపై అనిశ్చితి నెలకొన్నది. ఇలాంటి సమయంలో ఆర్బీఐ నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
కరోనా పరిణామాలు, అధిక ద్రవ్యోల్బణం భయాల కారణంగా ఆర్బీఐ కీలక రేట్లను యథాతథంగా ఉంచే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఏప్రిల్ 4వ తేదీన జరిగిన సమావేశంలో ఆర్బీఐ కీలక రేట్లలో మార్పులు చేయలేదు.
జీడీపీ వృద్ధి గణాంకాలు అంచనాలకు మించి సానుకూలంగా నమోదైన నేపథ్యంలో భవిష్యత్తు వృద్ధి అంచనాలను లెక్కగట్టే విషయంలో MPCకి కొంత అనుకూలత ఏర్పడిందంటున్నారు. అయితే కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు వివిధ రాష్ట్రాలు విధించిన లాక్డౌన్, కరోనా ఆంక్షలు ఆర్థిక వ్యవస్థ రికవరీపై దెబ్బతీశాయని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆర్బీఐ సర్దుబాటు వైఖరిని కొనసాగిస్తుందంటున్నారు.