RBI MPC meeting: వడ్డీ రేటు నుండి జీడీపీ వరకు.. శక్తికాంతదాస్ ఏం చెప్పనున్నారు?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంత దాస్ నేడు (అక్టోబర్ 8 శుక్రవారం) ఉదయం పది గంటలకు మీడియా ముందుకు రానున్నారు. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ బుధవారం నుండి శుక్రవారం వరకు మూడు రోజుల పాటు సమావేశమై, కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ నిర్ణయాలకు సంబంధించిన వివరాలను ఆర్బీఐ గవర్నర్ మీడియా ద్వారా వెల్లడిస్తారు. 'అక్టోబర్ 08, 2021 ఉదయం పది గంటలకు శక్తికాంత దాస్ మాట్లాడుతార'ని కేంద్ర బ్యాంకు ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఆర్బీఐ ఇప్పటికే ఎనిమిదిసార్లు వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేట్లు దశాబ్దాల కనిష్టానికి తగ్గించింది. ప్రస్తుతం ఆర్థిక రికవరీ కనిపిస్తున్నప్పటికీ, డిమాండ్కు ఊతమిచ్చేందుకు వడ్డీ రేట్లను మరింతకాలం స్థిరంగా కొనసాగించే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
అప్పటి వరకు అనుకూల వైఖరి
క్రితం మానిటరీ పాలసీ సందర్భంగా శక్తికాంత దాస్ మాట్లాడుతూ కేంద్ర బ్యాంకు రెపో రేటును ప్రస్తుతం స్థిరంగా కొనసాగిస్తుందని, అలాగే, వృద్ధికి మద్దతు ఇవ్వడానికి అవసరమున్నంత వరకు ఇలాంటి అనుకూల వైఖరిని కొనసాగిస్తుందని కూడా అప్పుడే స్పష్టం చేశారు. పెరుగుతున్న గ్లోబల్ కమోడిటీ ధరలు, రూపాయి క్షీణత నేపథ్యంలో దేశంలో ద్రవ్యోల్భణాన్ని నిర్వచించడానికి ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ ఎలా ముందుకు సాగుతుంద అని నిపుణులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. పండుగ డిమాండ్ నేపథ్యంలో వినియోగంపై ఆర్థిక వ్యవస్థ ఎంతో ఆసక్తిగా ఉందని, ఈ నేపథ్యంలో పాలసీ వడ్డీ రేటుకు సంబంధించి ఆశ్చర్యకర నిర్ణయాలు ఉంటాయని తాము ఆశించడం లేదని కేర్ రేటింగ్స్ చీఫ్ ఎకనమిస్ట్ మదన్ సబ్నవీస్ అన్నారు. ఆరుగురు సభ్యులతో కూడిన ఆర్బీఐ ఎంపీసీ భేటీలో వడ్డీ రేటును సవరించే అవకాశాలు ఉండకపోవచ్చునని ఇటీవల ఓ సర్వేలో ఆర్థిక నిపుణులు భావించారు. వడ్డీ రేటు పైన స్టేటస్ కో (యథాతథం) విధించవచ్చునని తెలిపారు.
ద్రవ్యోల్భణం, వృద్ధి రేటు
రేపో రేటు తగ్గింపుతో పాటు పలు అంశాలపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రెస్ మీట్ కోసం వేచి చూస్తున్నారు. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) సెప్టెంబర్ 12, 2021 డేటా ప్రకారం ఆహార ధరల తగ్గింపు నేపథ్యంలో సీపీఐ ఆధారిత ద్రవ్యోల్భణం ఇటీవల తగ్గింది. ఆగస్ట్ 2021లో 5.30 శాతం, జూలైలో 5.59 శాతంతో పోలిస్తే తగ్గవచ్చు. సెప్టెంబర్ నెలలో ద్రవ్యోల్భణ దృక్పథం ఏడాది ప్రాతిపదికన 4.62 శాతంగా ఉండవచ్చునని అంచనా.
కేంద్రబ్యాంకు అంచనాలకు మించి వివిధ రంగాలు ఇటీవల వేగంగా పుంజుకుంటున్నాయి. అన్ని రంగాల్లో వృద్ధి కనిపిస్తోంది. దీంతో ఆర్థిక పునరుద్ధరణ ఆశాజనకంగా ఉంటోంది. FY22 రియల్ జీడీపీ అంచనాలు గతంలో 9.5 శాతంగా అంచనా వేయగా, Q1FY23 వృద్ధి రేటును 17.2 శాతంగా అంచనా వేస్తున్నారు.
ఆర్బీఐ లిక్విడిటీ మేనేజ్మెంట్ మ్యాప్ను ప్రకటించే అవకాశముంది. ఎందుకంటే కోర్ లిక్విడిటీ సర్ప్లస్ రూ.12 లక్షల కోట్ల వద్ద స్థిరంగా ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది మరింత లిక్విడిటీ ఇన్ఫ్యూషన్ని పరిమితం చేయవచ్చు.
ప్రత్యేక బహిరంగ మార్కెట్ కార్యకలాపాలు వంటి కొన్ని లిక్విడిటీ మద్దతుకు చిన్న సర్దుబాట్లతో పొడిగింపును కొనసాగించే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.
శక్తికాంత దాస్ ప్రెస్ మీట్
ఆర్బీఐ మానిటరీ పాలసీ నిర్ణయాలకు సంబంధించిన శక్తికాంతదాస్ ప్రెస్ మీట్ వివరాలను యూట్యూబ్ ద్వారా (https://youtu.be/2dnxFikeNX8)
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫేస్బుక్ ద్వారా కేంద్ర బ్యాంకు ట్విట్టర్ ద్వారా చూడవచ్చు.
కరోనా థర్డ్ వేవ్ ఆందోళనలు, కరెంట్ అకౌంట్ సర్ప్లస్ వంటి అంశాలు కూడా ఆర్బీఐ పాలసీలో కీలకం.
భారత ఆర్థిక వ్యవస్థలోకి లిక్విడిటీ జొప్పించే అవకాశాలు ఉన్నాయి.