RBI Monetary Policy: జీ-సెక్ మార్కెట్, రిటైల్ ఇన్వెస్టర్లకు యాక్సెస్
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంతదాస్ శుక్రవారం (ఫిబ్రవరి 5) ద్రవ్య విధాన సమీక్ష ఫలితాలను వెల్లడించారు. రిటైల్ ఇన్వెస్టర్లకు ఇప్పుడు ప్రాథమిక, ద్వితీయ ప్రభుత్వ సెక్యూరిటీస్ మార్కెట్లో ఆన్లైన్ యాక్సెస్ ఇవ్వబడుతుందని ఆర్బీఐ ప్రకటించింది. ఇది పెట్టుబడిదారుల బేస్ను విస్తృతం చేస్తుందని, అలాగే, రిటైల్ పెట్టుబడిదారులకు ప్రభుత్వ సెక్యూరిటీల (G-Sec) మార్కెట్లో పాల్గొనే అవకాశం కల్పిస్తుందని శక్తికాంత దాస్ తెలిపారు.
జనవరి-మార్చి 2021లో సీపీఐ ద్రవ్యోల్భణం 5.2 శాతానికి సవరించినట్లు శక్తికాంత దాస్ తెలిపారు. గత డిసెంబర్తో పోలిస్తే ఆర్థిక రికవరీ మరింతగా కనిపిస్తోందన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందని, కరోనా వల్ల జరిగిన నష్టం నుండి కోలుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. డిఫాల్ట్ కార్పోరేట్ బాండ్స్లో పెట్టుబడులు పెట్టిన FPIలు షార్ట్ టర్మ్ లిమిట్, మీడియం టర్మ్ రెసిడ్యుల్ మెచ్యూరిటీ రిక్వైర్మెంట్ నుండి మినహాయిస్తున్నట్లు తెలిపారు.
కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచినట్లు కూడా ప్రకటించారు. ఈ మేరకు శక్తికాంతదాస్ ప్రకటన చేశారు. రెపో రేటు, రివర్స్ రెపో రేటులో ఎలాంటి మార్పులు చేయడం లేని తెలిపారు. మందగమనం, కరోనా కారణంగా రెపో రేటు 4 శాతానికి దిగి వచ్చింది. దీనిలో మార్పులు చేయలేదు. అలాగే, 2021-22 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 10.5 శాతంగా ఉండవచ్చునని అంచనా వేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 26.2 శాతం నుండి 8.3 శాతం వరకు, మూడో త్రైమాసికంలో 6 శాతంగా నమోదు కావొచ్చునని అంచనా వేశారు.