RBI Monetary Policy: వడ్డీ రేట్లు యథాతథం, జీడీపీ 10.5%
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) శుక్రవారం (ఫిబ్రవరి 5) ద్రవ్య విధాన సమీక్ష ఫలితాలను వెల్లడించారు. కీలక వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచింది ఆర్బీఐ. ఈ మేరకు శక్తికాంతదాస్ ప్రకటన చేశారు. రెపో రేటు, రివర్స్ రెపో రేటులో ఎలాంటి మార్పులు చేయడం లేని తెలిపారు. మందగమనం, కరోనా కారణంగా రెపో రేటు 4 శాతానికి దిగి వచ్చింది. దీనిలో మార్పులు చేయలేదు. అలాగే, 2021-22 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 10.5 శాతంగా ఉండవచ్చునని అంచనా వేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 26.2 శాతం నుండి 8.3 శాతం వరకు, మూడో త్రైమాసికంలో 6 శాతంగా నమోదు కావొచ్చునని అంచనా వేశారు.
సీపీఐ ద్రవ్యోల్భణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో 5.2 శాతంగా అంచన వేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ సంవత్సరంలో 5.2 శాతం నుండి 5 శాతానికి అంచనా వేశారు. మూడో త్రైమాసికంలో 4.3 శాతంగా ఉండవచ్చునని తెలిపారు. కూరగాయల ధరలు దాదాపు ఇలాగే ఉండవచ్చునని ఎంపీసీ అంచనా వేసింది.
ఆర్థిక వ్యవస్థలో అవసరమైన లిక్విడిటీకి ఆర్బీఐ సిద్ధమని శక్తికాంత దాస్ తెలిపారు. అవసరానికి అనుగుణంగా చర్యలు ఉంటాయన్నారు. ప్రభుత్వ రుణ ప్రణాళికలకు సంబంధించి మార్కెట్ అడ్డంకులు లేకుండా కేంద్ర బ్యాంకు చూస్తుందని తెలిపారు.