RBI Monetary Policy: IMPS ట్రాన్సాక్షన్ పరిమితి రూ.5 లక్షలకు పెంపు
ఇన్స్టాంట్ ఫండ్ ట్రాన్సుఫర్ ఇమ్మిడీయేట్ పేమెంట్ సర్వీసెస్(IMPS) ట్రాన్సాక్షన్ పరిమితిని రూ.2 లక్షల నుండి రూ.5 లక్షల వరకు పెంచాలని ప్రతిపాదన చేసినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ బుధవారం నుండి శుక్రవారం వరకు 3 రోజుల పాటు సమావేశమై, కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ భేటీకి సంబంధించిన వివరాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ నేడు (శుక్రవారం, అక్టోబర్ 8) మీడియాకు వివరించారు. IMPS అనేది మొబైల్ ఫోన్ ద్వారా తక్షణ ఇంటర్ బ్యాంక్ ఎలక్ట్రానిక్ ఫండ్ బదలీ సేవ.
SFBల కోసం రూ.10,000 కోట్ల స్పెషల్ 3 ఇయర్ ఎల్టీఆర్వోను డిసెంబర్ 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు శక్తికాంత దాస్ తెలిపారు. అప్పటి వరకు ఇది అందుబాటులో ఉంటుందన్నారు. ఆఫ్ లైన్ మోడ్లో రిటైల్ డిజిటల్ చెల్లింపుల కోసం ప్రేమ్ వర్క్ను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు.
డిమాండ్ క్రమంగా మెరుగు పడుతోందని, కానీ మందకోడిగా ఉందని ఆర్బీఐ గవర్నర్ అన్నారు. ఔట్ పుట్ ప్రీ-పాండమిక్ స్థాయి కంటే తక్కువస్థాయిలో ఉందని చెప్పారు. రికవరీ నిరంతర పాలసీ మద్దతుపై ఆధారపడి ఉందని తెలిపారు. దేశంలో 40 శాతం ఆర్థిక కార్యకలాపాలకు దోహదపడే కాంటాక్ట్ ఇంటెన్సివ్ సర్వీసెస్ ఇప్పటికీ వెనుకబడి ఉన్నాయని చెప్పారు. సరఫరా వైపు, ఖర్చు ఒత్తిడి ద్రవ్యోల్భణంపై ప్రభావం చూపుతోందన్నారు. సరఫరా గొలుసు సాధారణ స్థితికి రావాల్సి ఉందన్నారు.
కరోనా మహమ్మారి ప్రభావం నుండి బయటపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో లిక్విడిటీ పరిస్థితులు స్థూల ఆర్థిక ప్రమాణాలతో సమకాలీకరించబడాలనేది మార్కెట్ భాగస్వాములు, విధానరూపకర్తల అభిప్రాయమన్నారు. తద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని నిలబెట్టాలన్నారు. కాగా ఎంపీసీకి చెందిన ఆరుగురు సభ్యుల్లో శశాంక బిండే, అషిమా గోయల్, ప్రొఫెసర్ జయంత్ వర్మ, మృదుల్ సాగర్, మైఖేల్ దేబబ్రత పాత్ర, శక్తికాంత దాస్ ఉన్నారు.