RBI monetary policy: జీడీపీ వృద్ధి అంచనాలు 9.5%, ఈ స్కీం 3 నెలలు పొడిగింపు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ద్రవ్య పరపతి విధాన కమిటీ(MPC) ద్వైమాసిక పాలసీ సమీక్ష బుధవారం ఆగస్ట్ 4వ తేదీన ప్రారంభమై, మూడు రోజుల పాటు జరిగింది. నేడు నేడు (శుక్రవారం, ఆగస్ట్ 6) ముగిసింది. ఈ సమావేశం అనంతరం MPC తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన వివరాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మీడియాకు వివరించారు. ఆయన ఉదయం పది గంటలకు వివరాలు వెల్లడించారు. శక్తికాంత దాస్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల సమావేశం జరిగింది. వడ్డీ రేటు, జీడీపీ వృద్ధి రేటు అంచనాలు, ద్రవ్యోల్భణం వంటి అంశాలపై MPC పలు నిర్ణయాలు తీసుకుంది.
2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్(GDP) వృద్ధి రేటు అంచనాలను 9.5 శాతంగానే కొనసాగిస్తున్నట్లు శక్తికాంత దాస్ తెలిపారు. అలాగే 2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో వృద్ధి రేటు 21.4 శాతంగా ఉండవచ్చునని, రెండో త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్) 7.3 శాతంగా ఉండవచ్చునని, మూడో త్రైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్) 6.3 శాతంగా ఉండవచ్చునని, నాలుగో త్రైమాసికంలో (జనవరి-మార్చి) 6.1 శాతంగా ఉండవచ్చునని అంచనా వేసింది.
వినియోగం, ఇన్వెస్ట్మెంట్, ఎక్స్టర్నల్ డిమాండ్ వంటివి క్రమంగా పెరుగుతున్నట్లు తెలిపింది. కరోనా వ్యాక్సినేషన్ దేశవ్యాప్తంగా వేగవంతమైన నేపథ్యంలో రికవరీ కనిపిస్తోందని తెలిపారు. ఆర్బీఐ MPC సభ్యులు అందరు కూడా వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించడానికి, ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి అవసరమైన ఇతర కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. మే 2021లో సిపీఐ ద్రవ్యోల్భణం ఆసక్తికరంగా ఉన్నట్లు తెలిపారు. డిమాండ్ దృక్పథం మెరుగు పడుతోందన్నారు. అయితే వివిధ రంగాల్లో సరఫరా-డిమాండ్ బ్యాలెన్స్ను పునరుద్ధరించడానికి మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉందని తెలిపారు.
ఆర్బీఐ ద్రవ్యోల్భణం అంచనాలను 5.7 శాతానికి పెంచింది. ప్రస్తుతం ఇది 5.1 శాతంగా ఉంది. రెండో త్రైమాసికం వరకు ఆర్బీఐ అంచనాలకు ఎగువకు ద్రవ్యోల్భణం ఉండవచ్చునని శక్తికాంత దాస్ తెలిపారు. ఆన్-ట్యాప్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్ స్కీంను మరో మూడు నెలలు అంటే డిసెంబర్ 2021 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర బ్యాంకు రెండు G-SAP వేలాలను (ఒక్కొక్కటి రూ.25,000 కోట్లు) నిర్వహిస్తోందని తెలిపారు.
కాగా, రెపో రేటును నాలుగు శాతంతో స్థిరంగా కొనసాగిస్తున్నట్లు కూడా శక్తికాంత దాస్ తెలిపారు. బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు, రెపో రేటును యథాతథంగా కొనసాగించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావించినట్లుగానే ఆర్బీఐ స్థిరంగా ఉంచింది. ఆర్బీఐ వరుసగా ఏడుసార్లు వడ్డీ రేటును యథాతథంగా కొనసాగించింది.
కరోనా నేపథ్యంలో ఫైనాన్షియల్, ఆర్థిక వ్యవస్థల పురోగతికి సరళతర విధానాలు అవలంభించాల్సిన అవసరం ఉండటం, ద్రవ్యోల్భణం కట్టడి అవుతోందనే అంచనాల నేపథ్యంలో కీలకమైన రెపో రేటును అలాగే కొనసాగించవచ్చునని విశ్లేషకులు భావించారు. మార్చి 2020 తర్వాత కరోనా కారణంగా ఆర్బీఐ 115 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ప్రస్తుతం రెపో రేటు 4 శాతం కాగా, రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా ఉంది. ఇక, FY22లో ద్రవ్యోల్భణం ఔట్లుక్ గతంలో 5.1 శాతం అంచనా వేయగా, దీనిని సవరించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావించారు.