RBI Monetary Policy: జీడీపీ 7.2% తగ్గింపు, ద్రవ్యోల్భణం 5.7%
కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) భారత రియల్ జీడీపీని 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను స్వల్పంగా తగ్గించింది. మరోవైపు, కీలక వడ్డీ రేట్ల రెపో రేటును యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ శక్తికంతదాస్ ఎంపీసీ సమావేశానికి సంబంధించిన వివరాలను మీడియాకు వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రియల్ జీడీపీ వృద్ధి రేటును 7.2 శాతానికి తగ్గించింది. అంతకుముందు దీనిని 7.8 శాతంగా అంచనా వేసింది. అలాగే, ద్రవ్యోల్భణం అంచనాలను 5.7 శాతానికి సవరించింది.
ఆర్బీఐ వరుసగా 11వసారి కీలక వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించింది. ఫలితంగా రెపో రేటు నాలుగు శాతం వద్ద కొనసాగుతోంది. ద్రవ్య లభ్యతను మెరుగుపరిచే ఉద్దేశ్యంతో రివర్స్ రెపో రేటును మాత్రం 40 బేసిస్ పాయించ్లు పెంచి 3.75 శాతంగా నిర్ణయించారు. 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు.
కరోనా సంక్షోభం తర్వాత ప్రారంభంలో ద్రవ్యలభ్యతను మెరుగు పరిచేందుకు ప్రారంభమైన సర్దుబాటు వైఖరిని ఆర్బీఐ ఇంకా కొనసాగిస్తోంది. కరోనా సంక్షోభం నుండి ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటోంది. మరోవైపు, అమెరికాలో వడ్డీ రేట్లను పెంచనున్నట్లు ఫెడ్ రిజర్వ్ తెలిపింది. దేశీయంగా చమురు, కమోడిటీ ధరలు పెరిగి ద్రవ్యోల్భణం ఆందోళన కలిగిస్తోంది.