RBI monetary policy: జీడీపీ వృద్ధి రేటు అంచనా 10.5%
ముంబై: 2021-22 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 10.5 శాతంగా ఉంటుందని ఆర్బీఐ ఆంచనా వేసింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని పరపతి విధాన కమిటీ (MPC) మూడు రోజుల సమావేశం సోమవారం ప్రారంభమైంది. MPC నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ బుధవారం వెల్లడించారు.
కరోనా కేసులు పెరుగుతుండటం, కొన్నిచోట్ల లాక్డౌన్ ఆంక్షల విధింపు నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న సర్దుబాటు విధాన వైఖరి కొనసాగింపునకే ఆర్బీఐ మొగ్గుచూపింది. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి పరిమితం చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఆర్బీఐ నిర్ణయాలు తీసుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది మొదటి ద్రవ్య పరపతి విధాన సమీక్ష. ధరల స్థిరత్వం, వృద్ధి, ఆర్థిక స్థిరత్వం వంటి అంశాలపై ఆర్బీఐ ప్రధానంగా దృష్టి సారించింది.
కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయని, ఆర్థికవృద్ధి పునరుత్తేజంలో అస్థిరతను పెంచాయని శక్తికాంత దాస్ అన్నారు. ఈ వైరస్ వ్యాప్తిని కట్టడి చేస్తూ ఆర్థిక వ్యవస్థ రికవరీపై దృష్టి సారించాల్సిన అవసరముందన్నారు.వ్యవస్థలో సరిపడా ద్రవ్యలభ్యత ఉండేలా ఆర్బీఐ చర్యలు చేపడుతుందని తెలిపారు. ఈ ఆర్ధిక సంవత్సరం ప్రథమార్ధంలో ద్రవ్యోల్బణం 5.2 శాతంగా ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. మూడో త్రైమాసికం నాటికి అది 4.4 శాతానికి పరిమితంకావొచ్చని అభిప్రాయపడింది.