నిర్ణయం కోసం వేచి చూస్తున్నాం: క్రిప్టోకరెన్సీపై ఆర్బీఐ గవర్నర్ ఆందోళన!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) త్వరలో ప్రవేశపెట్టనున్న డిజిటల్ కరెన్సీకి, మార్కెట్లో ప్రస్తుతం ట్రేడ్ అయ్యే బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీలకు ఏమాత్రం సంబంధం లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఒక మీడియా గ్రూప్ ఏర్పాటు చేసిన ఎకనమిక్ సదస్సులో గురువారం ఆయన మాట్లాడారు. క్రిప్టోకరెన్సీల విషయంలో ప్రభుత్వంతో తమకు ఎలాంటి అభిప్రాయబేధాల్లేవని, వాటిపై తమకున్న ఆందోళనల్ని ప్రభుత్వానికి తెలియజేసినట్లు చెప్పారు. అయితే, ఆ ప్రయివేటు క్రిప్టోకరెన్సీలను నిషేధించాలా? వద్దా? అనే నిర్ణయం ప్రభుత్వానిదే అన్నారు. ఆర్థిక స్థిరత్వమే ప్రభుత్వ, ఆర్బీఐ ప్రధాన లక్ష్యమన్నారు.
ఆర్థిక స్థిరత్వానికి కట్టుబడి ఉన్నాం
ప్రభుత్వం, ఆర్బీఐ.. రెండూ ఆర్థిక స్థిరత్వానికి కట్టుబడి ఉన్నాయని శక్తికాంత దాస్ చెప్పారు. క్రిప్టోపై ఆందోళనలు ఉన్నాయని, వీటిని ప్రభుత్వానికి తెలియజేశామని, తుది నిర్ణయం కోసం వేచి చూస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం కూడా తమ ప్రధాన ఆందోళనలతో ఏకీభవిస్తుందని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. ఫియట్ కరెన్సీ డిజిటల్ వర్షన్ పైన ఆర్బీఐ ప్రస్తుతం పని చేస్తోందని, అలాంటి సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టడం ద్వారా వ్యవస్థలో తలెత్తే ఆర్థిక స్థిరత్వ చిక్కులను అంచనా వేస్తున్నట్లు చెప్పారు.
క్రిప్టోకరెన్సీపై...
ఇదిలా ఉండగా, కంపెనీలు క్రిప్టోకరెన్సీల్లో జరిపిన ట్రాన్సాక్షన్స్ వివరాలను తప్పనిసరిగా వెల్లడించాలని కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఆదేశించింది.
క్రిప్టోను నిషేధిస్తూ ఆర్బీఐ ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టు గతంలో కొట్టివేసింది. గత జనవరిలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులో కూడా క్రిప్టోకరెన్సీలపై పూర్తిస్థాయి నిషేధం ప్రతిపాదించారు. అయితే ఈ నెల ప్రారంభంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్మలమ్మ మాట్లాడుతూ... క్రిప్టోకు ద్వారాలు పూర్తిగా మూయలేదన్నారు.
విదేశాలకు నెఫ్ట్, ఆర్టీజీఎస్
ప్రభావవంతమైన నిబంధనలకు ఆర్బీఐ ఎల్లప్పుడూ ప్రాధాన్యమిస్తుందని శక్తికాతదాస్ అన్నారు.ఆర్టీజీఎస్, నెఫ్ట్ సేవల్ని 24గంటలు అందుబాటులోకి తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ వ్యవస్థలకు విదేశీ కరెన్సీ సేవలను అందించే సామర్థ్యం కూడా ఉందని, వీటి సేవలను విదేశాలకు విస్తరించే అవకాశం ఉందన్నారు.