2 నెలల్లో మూడోసారి.. రెపోరేటు 40 పాయింట్స్ తగ్గించిన ఆర్బీఐ: EMI తగ్గే అవకాశం
ముంబై: కరోనా మహమ్మారి-షట్ డౌన్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం (మే 22) అన్నారు. రెండు నెలల వ్యవధిలో ఆర్బీఐ గవర్నర్కు ఇది మూడో మీడియా సమావేశం. రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న 4.4 శాతం నుండి 4 శాతానికి తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. రివర్స్ రెపో రేటును 3.2 శాతానికి తగ్గించారు. రెపో రేటు తగ్గిన నేపథ్యంలో ఆర్బీఐ కల్పించిన ఈ ప్రయోజనం బ్యాంకులు కస్టమర్లకు అందిస్తే ఈఎంఐ మరింత చౌక అవుతుంది.
మీడియా ముందుకు దాస్: ఈఎంఐ, క్రెడిట్ కార్డు పేమెంట్స్పై RBI భారీ ఊరట?
అలాగే నాబార్డ్, SIDBI, NHB వంటి సంస్థల ద్వారా రూ.50,000 కోట్ల రీఫైనాన్సింగ్ మద్దతును ప్రకటించారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి మరిన్ని చర్యల్లో భాగంగా వీటిని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకుల్లో ఉందని శక్తికాంత దాస్ చెప్పారు. కరోనా వల్ల పెట్టుబడుల ప్రవాహంపై గణనీయంగా ప్రభావం పడిందని చెప్పారు. సిమెంట్ ఉత్పత్తిలో 25 శాతం తగ్గిందన్నారు.
మార్చి, ఏప్రిల్ నెలల్లో సిమెంట్, ఉక్కు పరిశ్రమలపై భారీ ప్రభావం పడిందని చెప్పారు. కరోనా కారణంగా మార్చిలో పారిశ్రామికోత్పత్తి 17 శాతం తగ్గినట్లు చెప్పారు. మ్యానుఫ్యాక్చరింగ్ కార్యకలాపాలు 21 శాతం తగ్గాయన్నారు. ఇండస్ట్రీస్ ఉత్పత్తి 6.5 శాతం పడిపోయిందన్నారు. ఎలక్ట్రిసిటి, పెట్రోలియం వంటి వాటికి డిమాండ్ తగ్గిందన్నారు.
ఆహార ద్రవ్యోల్భణం ఏప్రిల్లో 8.6 శాతం పెరిగిందన్నారు. ఆహారధాన్యాల ఉత్పత్తి 3.7 శాతం వృద్ధి సాధించిందన్నారు. వ్యవసాయ రంగ ఉత్పత్తిలో పెరుగుదల ఉందన్నారు. ప్రపంచ వాణిజ్యం 13 శాతం నుండి 32 శాతం మేర తగ్గినట్లు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రకటించిందన్నారు. ఆర్థిక వృద్ధి రేటును పెంచే విధంగా ఆర్బీఐ ప్రకటనలు చేస్తోంది. ఇందులో భాగంగా 2 నెలల్లో మూడుసార్లు వడ్డీ రేట్లను సమీక్షించింది.