Shaktikanta Das: రూ.2000 నోట్ల రద్దుపై నోరు విప్పిన RBI గవర్నర్.. ఏమన్నారంటే..
Shaktikanta Das: దేశంలో రూ.2000 నోట్లను ఉపసంహరించుకున్నట్లు రిజర్వు బ్యాంక్ వెల్లడించిన తర్వాత గవర్నర్ శక్తికాంత దాస్ తొలిసారి స్పందించారు. నోట్లను మార్చుకునేందుకు తగినంత గడువు ఇవ్వటం జరిగిందని ఆందోళన అక్కర్లేదని దాస్ తెలిపారు.
దేశంలోని షాప్స్, వ్యాపారులు రూ.2000 నోట్లను కస్టమర్ల నుంచి తీసుకోకుండా నిరాకరించొద్దని ఆయన సూచించారు. అసలు రూ.2000 నోట్లను ప్రవేశపెట్టిన ఉద్ధేశం పూర్తైందని వెల్లడించారు. చాలా కాలం కింద నుంచే రెండు వేల రూపాయల నోట్ల ముద్రణను రిజర్వు బ్యాంక్ నిలిపివేసిన విషయాన్ని ఈ సందర్భంగా మీడియాకు వెల్లడించారు.

ఈ క్రమంలో నోట్ల ముద్రణలో సెక్యూరిటీ బ్రీచ్ జరిగిందంటూ వస్తున్న వాదనను ఆయన కొట్టిపడేశారు. 2016లో నోట్ల రద్దు సమయంలో రూ.500, రూ.1000 నోట్లకు బదులుగా లిక్విడిటీ గ్యాప్ నింపేందుకు రూ.2000 నోట్లను ప్రవేశపెట్టినట్లు దాస్ వెల్లడించారు. అయితే దానిని తీసుకొచ్చిన ప్రయోజనం పూర్తైనందున క్లీన్ నోట్ పాలసీ కింద తాజాగా ఉపసంహరించుకుంటున్నట్లు శక్తి కాంతదాస్ తెలిపారు. అధిక విలువ కలిగిన నోట్లు ఎల్లప్పుడూ క్లోనింగ్, మోసానికి గురయ్యే అవకాశం ఉందన్నారు.
అన్ని నోట్ల మాదిరిగానే రూ.2000 నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చని రిజర్వు బ్యాంక్ గవర్నర్ వెల్లడించారు. చాలా మంది విదేశాల్లో ఉన్నారు గడువులోగా తమ వద్ద ఉన్న రూ.2,000 నోట్లను మార్చుకోవడం లేదా డిపాజిట్ చేయడం సాధ్యం కాకపోవచ్చునని శక్తికాంత దాస్ అభిప్రాయపడ్డారు. అందువల్ల సెప్టెంబర్ 30, 2023 వరకు ఉన్న నోట్ల మార్పిడి గడువును పొడిగించే అవకాశం ఉందని సూచించారు. సమస్యలను పరిష్కరించేందుకు తాము ఏం చేయాలో చూస్తామని చెప్పారు.


Click it and Unblock the Notifications