ఆర్థిక స్థిరత్వం కోసం ఏ చర్యలైనా, కరోనా సంక్షోభం మనపైనా ఎక్కువే: ఆర్బీఐ, మరింత వడ్డీ కోత!
కరోనా మహమ్మారి ప్రభావాన్ని తగ్గించేందుకు, వృద్ధి పుంజుకోవడానికి అవసరమైన అన్ని చర్యలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చేపడుతోందని గవర్నర్ శక్తికాంతదాస్ ఈ సమీక్షలో అన్నారు. పరపతి విధాన కమిటీ సమావేశ వివరాలను ఆర్బీఐ వెల్లడించింది. ఆర్థిక మాంద్యంపై గత నెల 27న ముగిసిన ద్రవ్య విధాన కమిటీ మూడు రోజుల సమావేశంలో చర్చ జరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థపైనా ఈ వైరస్ ప్రభావం ఉంటుందని శక్తికాంత దాస్ చెప్పారు. సమావేశం వివరాలను సోమవారం ఆర్బీఐ విడుదల చేసింది.
వారికి కేంద్రం మరో గుడ్న్యూస్, 8 గ్యాస్ సిలిండర్లు ఉచితం
ప్రతికూల ప్రభావం తగ్గించి.. ఆర్థిక వ్యవస్థను రక్షించాలి
కరోనా నేపథ్యంలో ఆర్థిక స్థిరత్వం కట్టుతప్పకుండా కాపాడుకోవడంతో పాటు డిమాండ్ మరింత క్షీణించకుండా రక్షించుకోవడమే ద్రవ్య పరపతి విధానం ప్రధాన లక్ష్యం కావాలి. ప్రతికూల ప్రభావాన్ని సాధ్యమైనంత మేర తగ్గించి దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేయాలి. ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుతూ వృద్ధి రేటును గాడిలో పెట్టే చర్యలు అవసరం.
వివిధ దేశాల కేంద్ర బ్యాంకుల చర్యలు
కరోనాతో తలెత్తిన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు అప్పటికే వివిధ దేశాల ప్రభుత్వాలు, కేంద్రబ్యాంకులు తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. కరోనా వల్ల గత కొద్ది రోజులుగా ప్రపంచ స్థూల ఆర్థిక పరిస్థితులు దిగజారాయి. చాలా వరకు దశాల్లో లాక్ డౌన్, సామాజిక దూరం కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. దీనిని బాగు చేసేందుకు కేంద్ర బ్యాంకులు చర్యలు తీసుకుంటున్నాయి.
కరోనాను కట్టడి చేయాలి
2008-09 ప్రపంచ ఆర్థిక మాంద్యం కంటే తీవ్ర ప్రభావం ఉండనుంది. స్వల్పకాలంలో వృద్ధి అంచనాలు భారీగా తగ్గుతాయి. పరిస్థితి మెరుగయ్యేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టాలి. ఆర్థిక స్థిరత్వం కాపాడేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. స్థూల ఆర్థిక వ్యవస్థకు నష్టం చేయడానికి ముందే కరోనాను కట్టడి చేయాలి. పరిస్థితులు మెరుగయ్యేందుకు చాలా చర్యలు చేపట్టాలన్నారు.
సమయం పడితే డిమాండ్ తగ్గుతుంది
పరిస్థితి సాధారణస్థాయికి రావడానికి మరింత సమయం పడితే డిమాండ్ తగ్గిపోతుంది. వివిధ రంగాలకు డబ్బులు వెళ్లేలా చూడటం ఇప్పుడు తప్పనిసరి. పరిస్థితులను ఆర్బీఐ ఎప్పటికి అప్పుడు పరిశీలిస్తోంది. అవసరమైతే సంప్రదాయ, సంప్రదాయేతర ఆర్థిక సాధనాల్లో దేనిని వినియోగించేందుకైనా సిద్ధం. ఆర్థిక మాంద్యం ప్రభావం మనపైనా ఉంటుందని, స్థిరత్వమే ప్రస్తుత కర్తవ్యమని శక్తికాంత దాస్ అన్నారు.
రెపో రేటు మరింత తగ్గించేందుకు రెడీ
మార్చి 27వ తేదీన ముగిసిన MPC సమావేశంలో ఆర్బీఐ రెపో రేటు 75 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.15 శాతం నుంచి 4.40 శాతం కుదించింది. నగదు నిల్వ నిష్పత్తిని 4% నుంచి 3% కుదించి దాదాపు రూ.1.34 లక్షల కోట్ల అదనపు నిధులను అందుబాటులోకి తెచ్చింది. ఆర్థిక, ద్రవ్య స్థిరత్వం కోసం అవసరమైతే అందుబాటులో ఉన్న మరిన్ని చర్యలకూ సిద్ధంగా ఉన్నట్టు శక్తికాంత దాస్ ప్రకటించారు. కరోనా ప్రభావాన్ని కట్టడి చేసేందుకు కీలకమైన రెపో రేటును మరింత తగ్గించేందుకు కూడా ఆర్బీఐ సిద్ధంగా ఉందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.