G20 దేశాల్లో భారత్ బెస్ట్, FY21లో భారీ వృద్ధి రేటు: RBI గవర్నర్
ముంబై: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం అన్నారు. ఆయన ఈ రోజు (ఏప్రిల్ 17) మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడారు. భారత ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావాన్ని ఎప్పటికి అప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పారు. ప్రస్తుత పరిస్థితులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. పరిస్థితికి అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. క్వారంటైన్లో ఉండి సేవలు అందిస్తున్న ఉద్యోగులకు, కరోనా ఉద్యోగులకు సేవలు చేస్తున్న డాక్టర్లకు ఆయన థ్యాంక్స్ చెప్పారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల కార్యకలాపాలు సాధారణ స్థితికి వచ్చేందుకు కృషి చేయాల్సి ఉందన్నారు.
RBI గవర్నర్ ప్రెస్ కాన్ఫరెన్స్, భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 1,000 అప్
1930 నాటి పరిస్థితులు
1930 నాటి సంక్షోభాన్ని ఇప్పుడు కరోనా కారణంగా చూస్తున్నామని దాస్ అన్నారు. ప్రపంచ మార్కెట్లు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయన్నారు.
లాక్ డౌన్ ప్రకటన తర్వాత డిమాండ్ భారీగా పడిపోయిందన్నారు. అయితే భారత ఆర్థిక పరిస్థితి మిగతా దేశాల కంటే బాగుందని అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా దేశాల వృద్ధి రేటు తిరోగమనంలో ఉందన్నారు. G20 దేశాల్లో భారత్ ఎక్కువ వృద్ధి రేటు నమోదు చేస్తుందని IMF వెల్లడించిందన్నారు.
1.20 లక్షల కోట్లు విడుదల చేశాం
స్థూల ఆర్థిక వ్యవస్థ క్షీణించిందని శక్తికాంత దాస్ చెప్పారు. లాక్ డౌన్ తర్వాత వ్యవస్థలోకి రూ.1.20 లక్షల కోట్లు విడుదల చేశామన్నారు. జీడీపీలో 3.2 శాతం ద్రవ్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. బ్యాంకుల్లో సరిపడా ద్రవ్యం అందుబాటులో ఉందని చెప్పారు.
భారత వృద్ధి రేటు
2020 ఏడాదిలో భారత వృద్ధి రేటు 1.9 శాతం ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసిందని శక్తికాంత దాస్ చెప్పారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మన వృద్ధి రేటు 7.4 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
కరోనా వల్ల వీరికి భారీ దెబ్బ
కరోనా కారణంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు భారీగా దెబ్బతిన్నాయని శక్తికాంత దాస్ చెప్పారు. ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.