యస్ బ్యాంకుకు రూ.60,000 రుణం, కానీ వడ్డీ రేటు అధికం!
యస్ బ్యాంకుకు మరో భారీ ఊరట. డిపాజిటర్ల డబ్బులు తిరిగి చెల్లించడంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు యస్ బ్యాంకుకు రూ.60,000 కోట్ల అత్యవసర రుణాలను ఇవ్వడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సిద్ధంగా ఉంది. బుధవారం సాయంత్రం నుండి బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. డిపాజిటర్లకు ఇబ్బందులు లేకుండా ఆర్బీఐ యాక్ట్ సెక్షన్ 17(4) కింద అదనపు ద్రవ్యలభ్యత నిధులను ఇస్తున్నట్లు తెలిపింది.
కరోనా దెబ్బతో RBI కీలక నిర్ణయం, మార్కెట్లోకి రూ.10,000 కోట్ల
ఎక్కువ వడ్డీ రేటు
మారటోరియం ఆంక్షలు తొలగి, పూర్తి స్థాయి సర్వీసులు ప్రారంభించిన యస్ బ్యాంకుకు అత్యవసరంగా నిధులు అవసరమైన పక్షంలో రూ.60,000 కోట్ల రుణ సదుపాయం కల్పిస్తామని ఆర్బీఐ చెప్పినప్పటికీ, ఈ మొత్తానికి యస్ బ్యాంకు సాధారణం కంటే ఎక్కువ వడ్డీ రేటును చెల్లించాల్సి ఉంటుందట.
2004 తర్వాత మళ్లీ ఇప్పుడు
2004లో గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ సంక్షోభంలో ఉన్నప్పుడు ఆర్బీఐ ఇలాగే రుణ సదుపాయం చేసింది. ఆ తర్వాత పదహారేళ్ల అనంతరం మళ్లీ ఇలాంటి పరిస్థితి యస్ బ్యాంకు రూపంలో వచ్చింది. అప్పట్లో గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకును ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్లో విలీనం చేశారు.
ఆ అవసరం రాకపోవచ్చు
గడిచిన కొన్నాళ్లుగా ఉపసంహరణ కంటే డిపాజిట్లే అధికంగా ఉన్నాయని, యస్ బ్యాంక్ ఇప్పటి వరకు రుణ సదుపాయం వినియోగించుకోలేదని, అసలు ఆ అవసరం కూడా రాకపోవచ్చునని కూడా అంటున్నారు.
డిపాజిటర్లు సొమ్ము కోల్పోవడానికి నో
కానీ డిపాజిటర్లు కష్టపడి సంపాదించిన సొమ్మును కోల్పోవడానికి ఎట్టి పరిస్థితుల్లోను అనుమతించబోమని ఇటీవల ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. ఈ సమయంలో అవసరమైతే ఆర్బీఐ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. అత్యవసర రుణాన్ని యస్ బ్యాంకు కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్కు అనుసంధానం చేస్తామని అంటున్నారు.
సొమ్ము భద్రం..
డిపాజిటర్ల సొమ్ము భద్రంగానే ఉందని యస్ బ్యాంకు అడ్మినిస్ట్రేటర్ ప్రశాంత్ కుమార్ పునరుద్ఘాటించారు. బ్యాంకు వద్ద తగినన్ని నిధులు ఉన్నాయని, బయటి వనరులపై ఆధారపడాల్సిన అవసరం లేదన్నారు. రుణ వితరణలో లొసుగులు, మొండి బకాయిలు, నిధుల కొరతతో సంక్షోభంలో చిక్కుకున్న యస్ బ్యాంకుపై మార్చి 5న ఆర్బీఐ మారటోరియం విధించిన విషయం తెలిసిందే. ఎస్బీఐ సహా వివిధ బ్యాంకులు పెట్టుబడులు పెట్టాయి.