రివర్స్ రెపో రేటు తగ్గింపు, రెపో యథాతథం: ఈ ధరలు తగ్గాయి, ఇవి పెరిగాయి
ముంబై: కరోనా వైరస్ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు వివిధ ప్రకటనలు చేశారు. మళ్లీ సమీక్షించి అవసరమైతే మరిన్ని చర్యలు చేపడతామన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉందని, బ్యాంకులు, ఆర్థిక సంస్థల కార్యకలాపాలు సాధారణ స్థితికి తెచ్చేందుకు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రకటనలో కీలక అంశాలు...
G20 దేశాల్లో భారత్ బెస్ట్, FY21లో భారీ వృద్ధి రేటు: RBI గవర్నర్
మార్కెట్పై ఆర్థిక భారం లేకుండా చూస్తాం..
మార్కెట్లపై ఆర్థిక భారం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు శక్తికాంత దాస్ చెప్పారు. మార్కెట్లను గాడిలో పెడతామన్నారు. బ్యాంకులలో నగదు నిల్వలు పెంచుతామని తెలిపారు. రుణాల మంజూరులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందన్నారు.
వివిధ సంస్థలకు రూ.50వేల కోట్లు
ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు రూ.50వేల కోట్ల నిధులు ఇస్తున్నట్లు తెలిపారు. రూ.25వేల కోట్లు నాబార్డుకు, రూ.10వేల కోట్లు ఎస్ఐడీబీఐకి, రూ.10వేల కోట్లు నేషనల్ హౌసింగ్ కార్పోరేషన్కు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఆర్బీఐ ఎస్ఎంఎస్ఈలకు రూ.50వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఏటీఎంలు పని చేస్తున్నాయి
దేశంలో 91 శాతం ఏటీఎంలు పని చేస్తున్నాయని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. బ్యాంకులు ఎప్పటికి అప్పుడు ఏటీఎంలలో నగదును నింపుతున్నాయని చెప్పారు.
రివర్స్ రెపో రేటు తగ్గింపు
ప్రస్తుత పరిస్థితుల్లో రివర్స్ రెపో రేటును తగ్గిస్తున్నట్లు శక్తికాంత దాస్ తెలిపారు. రెపో రేటు మాత్రం యథాతథంగా ఉంచారు. రివర్స్ రెపోను 4 శాతం నుండి 3.85 శాతానికి తగ్గించారు. ద్రవ్య వినిమయ సర్దుబాటు కింద ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
రాష్ట్రాలకు 60 శాతం నిధులు
రాష్ట్రాలకు అదనంగా 60 శాతం మేర నిధులు డబ్ల్యుఎంఏ కింద పెంచుతున్నట్లు శక్తికాంత దాస్ తెలిపారు. ఇది సెప్టెంబర్ 30వ తేదీ వరకు అమలులో ఉంటుందని తెలిపారు.
డివిడెండ్ లేదు..
ఆర్బీఐ నుండి తదుపరి ప్రకటన వచ్చే వరకు బ్యాంకులు డివిడెండ్స్ ప్రకటించవద్దని చెప్పారు. లిక్విడిటీ కవరేజీని వంద శాతం నుండి 80 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ నాటికి 90 శాతానికి, వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి 100 శాతానికి పునరుద్ధరించబడుతుందన్నారు. మారటోరియం కాలానికి ఎన్పీఏ వర్తించదని స్పష్టం చేశారు.
ఆటో రంగంపై తీవ్ర ప్రభావం
కరోనా వల్ల ప్రపంచ జీడీపీకి 9 ట్రిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లుతోందని శక్తికాంత దాస్ అన్నారు. మన దేశంలో విద్యుత్ డిమాండ్ 30 శాతం తగ్గిందని తెలిపారు. తయారీ రంగం నాలుగు నెలల కనిష్టానికి చేరుకుందని, ఆటో రంగం తీవ్రంగా దెబ్బతిన్నదన్నారు.
ఎల్బీజీ ధరలు తగ్గాయి, ఆహార ధరలు పెరిగాయి
ఏప్రిల్ 13వ తేదీ వరకు ఆహార ధరలు 2.3 శాతం పెరిగాయని శక్తికాంత దాస్ చెప్పారు. ఉల్లి ధరలు మాత్రం తగ్గాయన్నారు. పీడీఎస్ కిరోసిన్ ధరలు 24 శాతం మేర తగ్గాయని చెప్పారు. ఎల్పీజీ ధరలు 8 శాతం తగ్గినట్లు చెప్పారు. ఈ ప్రభావం ద్రవ్యోల్భణంపై ఉందన్నారు.
ఫారెక్స్ నిల్వలు ఉన్నాయి
మన వద్ద ఫారెక్స్ ఎక్స్చేంజ్ నిల్వలు సరిపడేంత ఉన్నాయని శక్తికాంత దాస్ తెలిపారు. మార్చి 2020లో ఎగుమతులు 34.6 శాతం తగ్గిపోయినట్లు తెలిపారు. ఇది ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో కంటే ఎక్కువగా పడిపోయిందన్నారు.