ముద్రా రుణాలతో జాగ్రత్త! ముందే హెచ్చరించిన రఘురాం రాజన్
ముంబై: ముద్ర రుణాల్లో పెరుగుతున్న NPAలపై ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ రుణాలను మరింత అప్రమత్తంగా పరిశీలించాలని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎంకే జైన్ సూచించారు. ముద్రా రుణాల మంజూరు, తిరిగి చెల్లింపుల్ని నిశితంగా పరిశీలించాలని బ్యాంకులకు సూచించారు. 2015 ఏప్రిల్ నెలలో ప్రధాని నరేంద్ర మోడీ ముద్రా రుణాలు ప్రారంభించారు. ఈ పథకం కింద చిన్న, మధ్య తరగతి సంస్థలకు రుణాలను మంజురూ చేస్తారు. వీటికి వడ్డీ రేట్లు చాలా తక్కువ.
పేదరికం నుంచి బయటకు తెచ్చేందుకు.. కానీ
ముద్రా రుణాల ద్వారా చాలా కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తెచ్చేందుకు ప్రభుత్వం భారీ ప్రయత్నం చేసిందని, ఈ రుణాలు చాలామందిని పేదరికం నుంచి బయటకు తెచ్చాయని, కానీ వీటి వల్ల మొండి బకాయిలు కూడా పెరిగిపోతున్నాయని ఎంకే జైన్ అన్నారు. ముద్రా రుణాలు ఇచ్చే సమయంలోనే బ్యాంకులు రీపేమెంట్కు సంబంధించి సరైన అంచనాలు వేసుకోవాలన్నారు.
వీరికి రూ.10 లక్షల వరకు రుణాలు..
చిన్న, మధ్య తరగతి వ్యాపారులకు రూ.10 లక్షల వరకు రుణం సులభంగా లభించే ఉద్దేశంతో ముద్రా రుణాలు తీసుకు వచ్చింది మోడీ ప్రభుత్వం. ప్రస్తుతం ముద్ర రుణాల విలువ రూ.3.21 లక్షల కోట్లకు పైన ఉన్నాయి. ఇవన్నీ కూడా బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFC), ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఇచ్చినవి. క్రెడిట్ రేటింగ్ పరంగా దిగువ స్థాయిలో ఉన్న కార్పొరేటేతర, చిన్న సూక్ష్మ తరహా పరిశ్రమలు, సంస్థల పరిధిలోలేని వ్యక్తిగత వ్యాపారులకు రుణాలు ఇస్తున్నారు.
ముందే హెచ్చరించిన రాజన్
ముద్రా రుణాల పథకాన్ని ప్రారంభించిన ఏడాదికే నాటి ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ముద్ర రుణాలపై హెచ్చరించారు. భవిష్యత్తులో వీటిలో ఎన్పీఏలు అనూహ్యంగా పెరగవచ్చునని ఆందోళన వ్యక్తం చేశారు. రాజన్ వ్యాఖ్యలను నాటి ఆర్థిక మంత్రి జైట్లీ కొట్టి పారేశారు.
ఇక్కడే సమస్య.
సాధారణంగా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు రుణాలు ఇచ్చేముందు రుణ గ్రహీతలు తిరిగి చెల్లిస్తారా? లేదా? అన్న అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తాయని, అయితే కేంద్ర ప్రభుత్వ పథకం కారణంగా నిర్దేశిత లక్ష్యాల్ని అందుకోవడం కోసం రుణాల్ని బ్యాంకులు ఇస్తూనే వెళ్తున్నాయని, దీంతో రుణాల్ని మంజూరు చేసే ముందు రుణగ్రహీతల ఆర్థిక పరిస్థితులను దగ్గరగా గమనించలేకపోతున్నారని, కానీ ఆర్థిక పరిస్థితుల్ని గమనించాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
NPAలు ఇలా పెరిగాయి...
2017-18 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2018-19లో ముద్ర స్కీం NPAలు 126% పెరిగాయి. 2017-18లో రూ.7,277.31 కోట్లుగా ఉన్న NPAలు 2018-19 చివరికల్లా రూ.9,204.14 కోట్లు పెరిగి 16,481.45 కోట్లకు చేరుకున్నాయి. మొత్తం ముద్రా రుణాల్లో 3.63 కోట్ల ఖాతాలు డిఫాల్ట్ అయ్యాయని తెలుస్తోంది. ఈ ఏడాది జూన్ వరకు 19 కోట్ల మందికి ముద్రా రుణాలు మంజూరు చేశారు. 2017-18తో పోలిస్తే 2018-19లో మొండి బకాయిలు 2.52 శాతం పెరిగాయి.