ఏటీఎం నుండి రూ.5,000 మించి ఉపసంహరిస్తే.. ఆర్బీఐ షాకిచ్చేనా? హైదరాబాద్ టెక్కీ ద్వారా వెలుగులోకి!
కరోనా మహమ్మారి నేపథ్యంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెంచడం ద్వారా ఈ వైరస్ వ్యాప్తిని నిర్మూలించడంతో పాటు వివిధ కారణాలతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగు వేస్తోందా? ఇందుకు అనుగుణంగా ఏటీఎం చార్జీలను పెంచే అవకాశముందా అంటే.. కావొచ్చునని ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నగదు ఉపసంహరణపై పరిమితి విధించే అవకాశాలు లేకపోలేదని, పరిమితి మించితే ఛార్జీలు ఉండవచ్చునట.
కొనేవాళ్లు లేరు.. వడ్డీ రేటు భారం: ప్రభుత్వం సాయంతో లాభమేంటి!?
ఏటీఎం నుండి రూ.5,000కు మించి తీస్తే...
ఏటీఎం నుండి ఒక ట్రాన్సక్షన్లో రూ.5,000 మాత్రమే ఉపసంహరించుకునే అవకాశం ఉండేలా నిర్ణయం తీసుకునే అంశాన్ని పరిశీలిస్తోందని తెలుస్తోంది. ఇదే కనుక అమలులోకి వస్తే అంతకుమించి ఉపసంహరించుకుంటే అదనపు ఛార్జీలు పడే అవకాశముంది. ఈ మేరకు ఇటీవల ఆర్బీఐ ఏర్పాటు చేసిన కమిటీ పలు కీలక సూచనలను చేసిందని తెలుస్తోంది. వివిధ రకాల ఛార్జీలు పెంచుతూ కమిటీ నివేదికను రూపొందించింది.
ఏటీఎం ఛార్జీలు ఎక్కడ ఎంత ఉండాలంటే
ఏటీఎంలలో జరిపే అన్ని ట్రాన్సాక్షన్స్ పైన ఇంటర్ఛేంజ్ ఛార్జీలు పెంచాలని కూడా ఈ కమిటీ సూచించిందని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని ఏటీఎంలకు ఇది వర్తించేలా చేయాలని పేర్కొంది. ఇక, 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో ఏటీఎం చార్జీలను ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్కు 16 శాతం లేదా రూ.2 పెంచాలని (రూ.17), నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్కు రూ.5 నుండి రూ.7కు పెంచాలని నివేదికలో పేర్కొందని తెలుస్తోంది.
10 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో మిశ్రమ ప్రాతిపదికన ఛార్జీలను 24 శాతం విధించాలని సూచించినట్లుగా తెలుస్తోంది. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్కు రూ.3పెంచి రూ.15 నుండి రూ.18, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్కు రూ.5 నుండి రూ.8 చేయాలని సూచించింది. ఆయా బ్యాంకుల బ్రాంచీల వద్ద పోలిస్తే ఏటీఎంల వద్ద మనీ ఉపసంహరణ ఎక్కువగా ఉంటుందని పేర్కొంది.
ఏటీఎం యూజర్లపై భారం
కాగా, కమిటీ సమర్పించిన రిపోర్టును బ్యాంకు అత్యున్నత స్థాయి అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో కమిటీ నివేదిక అమలుకు ఆర్బీఐ మొగ్గు చూపే అవకాశం లేకపోలేదని అంటున్నారు. దీంతో ఏటీఎం యూజర్లపై మరింత భారం పడే అవకాశముందంటున్నారు.
హైదరాబాద్ టెక్కీ ద్వారా సమాచారం బయటకు..
ఈ కమిటీ నివేదిక బయటకు రావడానికి హైదరాబాద్కు చెందిన ఓ టెక్కీ కారణమని పేర్కొంటున్నారు. హైదరాబాద్కు చెందిన టెక్కీ శ్రీకాంత్ ఎల్ సమాచార హక్కు చట్టం ద్వారా ఈ నివేదికకు చెందిన సమాచారాన్ని పొందారట. వాస్తవానికి ఈ నివేదికని ఆర్బీఐ పబ్లిక్ డొమైన్కు దూరంగా ఉంచింది. ఆర్బీఐ ఏర్పాటు చేసిన కమిటీలో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ వీజీ కన్నన్ కమిటీ చైర్పర్సన్గా ఉన్నారు. సభ్యులుగా దిలీప్ అస్బె(నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా సీఈవో), గిరికుమార్ నాయర్ (ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్), సంపత్ కుమార్ (హెచ్డీఎఫ్సీ బ్యాంకు లయబులిటీ ప్రోడక్ట్స్ గ్రూప్ హెడ్), కే శ్రీనివాస్ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ డైరెక్టర్), సంజీవ్ పటేల్ (టాటా కమ్యూనికేషన్స్ పేమెంట్ సొల్యూషన్స్ సీఈవో) ఉన్నారు.