RBI's caution message: పాత నోట్లు, పాత కాయిన్స్పై ఆర్బీఐ హెచ్చరిక
పాత కరెన్సీ నోట్లు, కాయిన్స్కు సంబంధించి కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) బుధవారం నాడు ఓ హెచ్చరిక జారీ చేసింది. పాత నోట్లు, పాత కాయిన్స్ ఆన్లైన్ కొనుగోళ్లు, అమ్మకాలుకు సంబంధించి ఆర్బీఐ ప్రజలకు ఈ హెచ్చరికలను జారీ చేసింది. పాత కరెన్సీ నోట్లను, నాణేల కమీషన్తో విక్రయిస్తామని, కొంటామని అనధికారికంగా చేసే మోసపూరిత ప్రకటనలను నమ్మవద్దని ఆర్బీఐ బుధవారం ఓ ప్రకటనలో ప్రజలను హెచ్చరించింది.
కొంతమంది వ్యక్తులు లేదా సంస్థలు ఆర్బీఐ పేరు, లోగోలను కూడా ఉపయోగించుకొని ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని అధికారులు వెల్లడించారు. ఆన్లైన్/ఆఫ్లైన్ మార్గాల ద్వారా పాత నోట్ల చలామణీ చేస్తూ ప్రజల నుండి ఛార్జీలు, కమీషన్లు, పన్నులు వసూలు చేస్తున్నట్లు తెలిసినట్లు వెల్లడించారు. ఆర్బీఐకి ఇలాంటి వ్యవహారాలతో సంబంధంలేదని, ఇలాంటి చలామణీలకు తమ ప్రతినిధులుగా ఎవరిని నియమించలేదని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ మూడు రోజుల పాటు సమావేశం అవుతుంది. కమిటీ తీసుకున్న కీలక నిర్ణయాలను శుక్రవారం ఆర్బీఐ గవర్నర్ వెల్లడించనున్నారు. ఆర్బీఐ మానిటరీ పాలసీ నేపథ్యంలో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) ద్వైమాసిక పాలసీ సమీక్ష బుధవారం ప్రారంభమైంది.
థర్డ్ వేవ్ భయాలు, వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2 నెలలుగా ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 2 నుండి 6 శ్రేణికి మించి నమెదు కావడం వంటి అంశాల నేపథ్యంలో తాజా సమావేశం జరుగుతోంది. బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు, రెపోరేటును కమిటీ యథాతథంగానే కొనసాగించే అవకాశముందని భావిస్తున్నారు.
కరోనా నేపథ్యంలో ఫైనాన్షియల్, ఆర్థిక వ్యవస్థల పురోగతికి సరళతర విధానాలే అవలంభించాల్సిన అవసరముండటం, ద్రవ్యోల్బణం కట్టడిలోకి వస్తోందనే అంచనాలు ఇందుకు కారణం. రెపోను వరుసగా ఆరు ద్వైమాసిక సమావేశాల నుంచి ఆర్బీఐ యథాతథంగా 4 శాతంగా కొనసాగిస్తోంది. మార్చి 2020 తర్వాత 115 బేసిస్ పాయింట్లు రెపోను తగ్గించిన ఆర్బీఐ, కరోనా కష్టకాలం దేశానికి ప్రారంభమైన తర్వాత యథాతథ రేటును కొనసాగిస్తూ వస్తోంది.