ప్రభుత్వం కోసం వేచిచూస్తున్నాం: బ్యాడ్బ్యాంక్పై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్
ముంబై: బ్యాడ్ బ్యాంకు ఏర్పాటు అంశంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ స్పందించారు. ఆర్బీఐ పరపతి ద్రవ్య విధాన సమీక్ష నిర్ణయాలను దాస్ వెల్లడించారు. ఈ సందర్భంగా బ్యాడ్ బ్యాంకు అంశంపై స్పందించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నుండి అధికారిక ప్రతిపాదన కోసం వేచి చూస్తున్నామన్నారు. ఇప్పటికే 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టిన బడ్జెట్ సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాడ్ బ్యాంకు ప్రతిపాదనకు పచ్చజెండా ఊపారు.
తాజా బడ్జెట్లో బ్యాంకింగ్ రంగంలో భారీ సంస్కరణలకు తెరలేపారు నిర్మలా సీతారామన్. బ్యాడ్ బ్యాంకును ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఎన్పీఏలు, మొండి బకాయిల్ని ఈ బ్యాంకుకు తరలించనున్నట్లు వెల్లడించారు. బ్యాంకుల ఖాతాలు సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. బ్యాంకు రీక్యాపిటలైజేషన్ కోసం రూ.20వేలకోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
RBI Monetary Policy: జీ-సెక్ మార్కెట్, రిటైల్ ఇన్వెస్టర్లకు యాక్సెస్
బ్యాడ్ బ్యాంకు అంశంపై గత కొన్నేళ్లుగా చర్చ సాగుతోంది. బ్యాంకులకు ఎన్పీఏలు, మొండి బకాయిలు పెరుగుతున్నందున బ్యాడ్ బ్యాంకు ఏర్పాటు చేయాలని పలువురు ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. ఇటీవల బడ్జెట్లో బ్యాడ్ బ్యాంకు ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తాజాగా, ఆర్బీఐ గవర్నర్ కూడా ప్రభుత్వ ప్రతిపాదన కోసం వేచి చూస్తున్నట్లు తెలిపారు.